October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం


దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్‌లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కుమారులను బావిలో తోసి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్‌ల కారణంగా అప్పుల బాధతో ఆ తండ్రి తన ఇద్దరు కొడుకులను చంపి, తాను కూడా చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇద్దరి పిల్లలను బావిలో తోసేసి
నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస్ (35) – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విగ్నేష్ (6), అనిరుధ్ (4) ఉన్నారు. ఇప్పుడంతా దసరా వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇద్దరి పిల్లల్ని తీసుకుని రాత్రి 7.30 గంటల సమయంలో దుర్గమ్మ నిమజ్జనానికి శ్రీనివాస్ వెళ్లాడు. ఇక రాత్రి 10 గంటలు దాటినా వారు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అపర్ణ శ్రీనివాస్‌కు ఫోన్ చేసింది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా అతడు లిఫ్ట్ చేయలేదు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన అపర్ణ పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. కానీ శ్రీనివాస్ ఆచూకీ కనిపించలేదు. అయితే ఆ బావి వద్దే శ్రీనివాస్ సెల్‌ఫోన్‌, వాచ్, చెప్పులను గుర్తించారు. దీంతో అతడు బావి లోపల కూరుకుపోయినట్లు గుర్తించి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతడి మృతదేహాన్ని బావిలో గుర్తించారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే శ్రీనివాస్ మృతికి బెట్టింగే కారణమని తెలుస్తోంది. శ్రీనివాస్ బెట్టింగ్‌లకు బాగా అలవాటు పడినట్లు సమాచారం. దీంతో శ్రీనివాస్, అపర్ణ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా శ్రీనివాస్ చేసిన అప్పులు తీర్చడానికి ఎకరం పొలం అమ్మినప్పటికీ చేసిన అప్పులు తీరలేదని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also read

Related posts

Share via