October 17, 2024
SGSTV NEWS
Spiritual

Lord Shiva: శివుడి వాహనం నంది ఎలా అయ్యాడు? ఎలా జన్మించాడు? ఎవరి తనయుడో తెలుసా..

హిందూ మతంలో సకల దేవతలకు ఏదోక వాహనం ఉంటుంది. జంతువులు, పక్షులు వంటివి దేవుళ్ళకు, దేవతలకు వాహనాలుగా ఉన్నాయి. త్రిమూర్తులలో సృష్టి కర్త అయిన బ్రహ్మ కు హంస వాహనం కాగా.. లోక రక్షకుడు అయినా శ్రీ మహా విష్ణువు వాహనం గరుత్మంతుడు.. ఇక లయకారుడు అయిన శివుడికి వాహనం నంది ఎద్దు. అయితే నంది ఎవరి పుత్రుడో తెలుసా.. అంతేకాదు శివ గణాల్లో ప్రధముడుగా శివుడికి ఇష్టమైన వాహనంగా నందీశ్వరుడు ఎలా మారాడో తెలుసా..


లయకారుడైన శివుడు అనగానే నందీశ్వరుడు గుర్తుకొస్తాడు. శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. శివ గణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తిగా పరిగణిస్తారు. శివుడు ఎక్కడుంటే.. అక్కడ ఆయన వాహనం అయిన నంది ఉంటుందని చెబుతారు. అంతేకాదు భక్తులకు ఏదైనా కోరిక ఉంటే.. ఆ కోరికను నందీశ్వరుడి చెవిలో చెబితే.. అది శివునికి చేరుతుందని విశ్వాసం. శివాలయంలోని శివ లింగం ముందు ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది.

నందీశ్వరుడు ఎవరంటే
ప్రమథగణములకు నాయకుడు నందీశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడిగా చెబుతారు. శివుని వాహనంగానే కాకుండా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు కూడా. నందీశ్వరుడిని శక్తి, కృషికి చిహ్నంగా భావిస్తారు.

నందీశ్వరుడు ఎవరి కొడుకు అంటే
పురాణ కథ ప్రకారం పురాతన కాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు కఠోర తపస్సు చేసి, శివుడి నుంచి వరంగా నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు అయిన కొడుకు కావాలి వారాన్ని పొందాడు. ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు, పురాణాల జ్ఞానాన్ని అందించాడు.

శివుడి వాహనంగా ఎలా మారాడంటే
పురాణాల ప్రకారం ఒకసారి ఇద్దరు మునులు శిలాదుడు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. తండ్రి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేసాడు. అప్పుడు తన కుమారుడిని దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వమని శిలాదుడు కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడని చెప్పారు. శిలాదుడు మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో శివుడి వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు. దీని తరువాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలు పెట్టాడు. నందీశ్వరుడు తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు.

శివుడు ముందు నంది ఎందుకు ఎదురుగా ఉంటుందంటే
నందీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి శివాలయాల్లో శివుడి ఎదురుగా ఉంటాడు. ప్రతిచోటా శివునికి అభిముఖంగా నంది ఉంటాడు. నంది ఉండే ఈ భంగిమ శివుడి పట్ల అతని అచంచలమైన శ్రద్ధ, భక్తికి చిహ్నం. నంది దృష్టి తన దైవంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.

నందీశ్వరుడి చెవిలో కోరికలు ఎందుకు చెబుతారంటే
సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు. కనుక భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతారు. నందీశ్వరుడు భక్తుల కోరికలను వింటాడు. శివుడు తపస్సు పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివుడికి నందీశ్వరుడు చెబుతాడు.

Related posts

Share via