February 24, 2025
SGSTV NEWS
Spiritual

శివరాత్రి కథ ఇదిగో.. పరమేశ్వరుడే పార్వతిదేవికి బోధించిన పవిత్ర గాధ


శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు

“శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు” అనే విషయం అందరికి తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమి జరగవు. ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు.

పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దపోయే దాకా ఎదురుచూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు.

ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా.. జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ, ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మాములుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేకవదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా.. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగివస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికే సరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు.

ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవభాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓ సారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్లింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు.

ఇంతలో మరోక జింక.. దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్లింది. మరికొద్ది సేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది.
ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కిందపడేటం చేశాడు. ఆ చెట్టుకిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది.

క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడిని పూర్తిగా మార్చి వేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడు. జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు.

Related posts

Share via