SGSTV NEWS
CrimeTelangana

Basara RGUKT Student Suicide: బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య..

 
సూసైడ్‌ లేఖను గోప్యంగా ఉంచిన పోలీసులు
నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో సోమవారం ఉదయం మరణించి కనిపించింది. తన గదిలో లభ్యమైన సూసైడ్ నోట్ ను, ఆమె సెల్ ఫోన్ ను పోలీసులు బయటికి రానివ్వకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు..


బాసర, నవంబర్‌ 11: నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్ధిని సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతి ప్రియ అనే విద్యార్ధిని పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఇద్దరు స్నేహితులతో కలసి రూం షేర్‌ చేసుకుంటుంది. ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్లు బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం వెళ్లారు. గదిలో సాయి ప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చే చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతి రాతతో ఓ సూసైడ్‌ నోట్‌ను గదిలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


ఆర్జీయూకేటీకి ఇటీవల నూతన ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ నియామకం తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు విద్యార్ధిని తల్లిదండ్రులు ఉజ్వల, రవీందర్‌ తమ కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. స్వాతి ప్రియ రాసిన సూసైడ్‌ లెటర్‌, ఆమె ఫోన్‌ను తమకు చూపించాలని ఆర్జీయూకేటీ యాజమన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.స్వాతి తల్లి ఉజ్వల మాట్లాడుతూ.. నా కుమార్తెను కాలేజీ అధికారులే చంపారు. ఉదయం నా కూతురు నాతో ఫోన్‌లో ఆనందంగా మాట్లాడింది. బ్రేక్‌ ఫాస్ట్‌కి వెళ్తున్నానని చెప్పింది. ఆ వెంటనే ఆమె ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది? ఆత్మహత్య చేసుకుందని కట్టుకథలు అల్లుతున్నారంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. మా కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి రవీందర్ సైతం అనుమానం వ్యక్తం చేశారు.

కాగా బాసర ఆర్జీయూకేటీ విద్యార్ధుల ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుంది. 2014 నుంచి 2021 మధ్య కాలంలో విద్యాపరమైన ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఇక్కడ చదువుతున్న తెలంగాణ విద్యార్ధుల్లో ఏకంగా 3,600 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు National Crime Records Bureau (NCRB) రిపోర్టు వెల్లడించింది. ఒక్క 2021లో అత్యధికంగా 567 మంది సూసైడ్‌ చేసుకున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇకపై అయినా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల ఆత్మహత్యలకు గల కారణాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also read

Related posts

Share this