April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. రోజూ అంతే.. అంతు చిక్కని మిస్టరీ



ఇదో విచిత్ర సంఘటన.. చీకటి పడితేచాలు ఆ కాలనీ ప్రజలంతా రాళ్ల భయంతో హడలెత్తిపోతున్మారు.. నలు దిక్కుల నుండి ఇళ్లపై రాళ్ళ వర్షం కురుస్తుండడంతో అక్కడి ప్రజలకు రాత్రంతా జాగారమే.. దెయ్యమో.. భూతమో.. లేక ఎవరైనా చేతబడి చేశారో ఏమో అని తెగ ఆందోళన చెందుతున్నారు.. రాత్రంతా కునుకు లేకుండా గస్తీ నిర్వహిస్తున్నారు.. అక్కడ ఏం జరుగుతుంది… ? ఎవరికీ అంతుచిక్కని ఆ వింత సమస్యను తెలుసుకుందాం పదండి..


అది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ.. చీకటి పడితేచాలు ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు… నలు దిక్కుల నుండి ఇళ్లపై రాళ్ల వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు ఇండ్లపై ఇలా రాళ్లు, మట్టి పెళ్లలు పడటంతో ఈ కాలనీ వాసులు వనికిపోతున్నారు…రాళ్ల భయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో స్థానికులు రాత్రంతా కాపలా కాస్తున్నారు.


చీకటి పడితేచాలు ఇళ్ల పై రాళ్ల శబ్దాలతో వణికిపోతున్నారు ఆ ప్రాంతవాసులు… ఏ ఇంటి పై కప్పులపై చూసినా రాళ్ల కుప్పలు కనిపిస్తున్నాయి.. రాళ్ల భయం నుండి విముక్తి కల్పించండని పోలీసులు, మున్సిపల్ అధికారులకు స్థానికులు మొర పెట్టుకుంటున్నారు. రాళ్లతో పాటు కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరి కాయలు కొట్టి, దీపం వెలిగి ఉంటుంది.. ఇది చూసి తట్టుకోలేక వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి వలస వెళ్లిపోయారు.. ఐతే ఏదో శక్తి కాలనీని ఆవహించిందని దెయ్యమో.. బూతమో.. తమను పగబట్టి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.. లేక ఎవరైనా చేతబడి చేసి ఉంటారని ఉలిక్కి పడుతున్నారు..

20 ఏళ్లగా వీళ్లు ఇక్కడే నివాసముంటున్నారు. వడ్డెర కులానికి చెందిన తాము అసలు ఎవరికి భయపడమని, ఇప్పుడు ఈ విచిత్రం వ్యవహారంతో భయానికి గురవుతున్నామని, అసలు ఏం చేయాలో తోచడం లేదని ఆందోళన చెందుతున్నారు.. టెక్నాలజీ విస్తరిస్తున్న నేటి కంప్యూటర్ యుగంలో ఇలాంటి సంఘటనలు జరుగడం, భయాలతో వణికిపోవడం, ఇంటికి తాళం వేసి వలస వెళ్ళడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..


ఐతే ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తున్నారా.. ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎందుకు ఇలా జరుగుతుంది ? ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం అనేది అంతు చిక్కడం లేదు… స్థానికులు రాత్రంతా గస్తీ తిరుగుతూ ప్రాణ నష్టం జరుగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.. ఇప్పటికైనా పోలీసులు – ఉన్నతాధికారులు స్పందించి వీరికి రాళ్ల భయం.. మూడ నమ్మకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు

Also read

Related posts

Share via