July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : దారుణం.. కన్న తల్లితోపాటు ఇద్దరు కూతుళ్ళను హతమార్చిన కసాయి..!

రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చాలా మంది చిన్న చిన్నపాటి సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కనీసం చిన్న పిల్లలు అని కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి పదేళ్ళలోపు ఇద్దరు పిల్లలతో పాటు కన్న తల్లిని హతమార్చాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది.

తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం అభం శుభం తెలియని ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను హతమార్చి పరారయ్యాడు.

పొలం తన పేరుపై రాయాలంటూ వెంకటేశ్వర్లు కొన్నేళ్ళుగా తల్లిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తల్లితోపాటు ఇద్దరు కన్న పిల్లలను చంపేశాడు దుర్మార్గుడు. ఇందుకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు.

Also read

Related posts

Share via