April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన.. యువకుడిని చితకబాది, కిడ్నాప్ చేసి హత్య..!

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి ఊరిలో ఉన్న ఓ యువకుడిని అత్యంత పాశవికంగా దాడి చేసి, కిడ్నాప్ చేసి హతమార్చారు. చివరికి 12గంటలపాటు కనిపించకుండా పోయిన యువకుడు వాగులో శవమై తేలాడు. దీంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి (20 )అనే యువకుడిని ఊటూరు గ్రామంలోని శివాలయం వద్ద తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చితకబాదారు. వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ప్రశాంత్ రెడ్డి ప్రక్కన ఉన్న పాడుబడిన బావిలో దూకాడు. అయినా వదిలి పెట్టకుండా బావిలో నుండి ప్రశాంత్‌ను బయటకు తీసి దుండగులు, కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.

ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, జరిగిన సంఘటన విషయమై ఆరా తీశారు. గ్రామాలలోని సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. దాదాపు 12 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, చివరకు పెద్దపెల్లి జిల్లా గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు వాగులో కిడ్నాప్ కు గురైన వ్యక్తి మృతదేహం ఆచూకీ కనుగొన్నారు

సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Also read

Related posts

Share via