February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..



హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్కాంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.


ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయ్.. ఆఫర్.. బంపర్ ఆఫర్.. పెట్టుబడి పెట్టండి.. అధిక వడ్డీ పొందండి.. అంటూ కేటుగాళ్లు ప్రజలను నమ్మించారు.. అలా ఒకటి రెండు కాదు.. వందల కోట్లు వసూలు చేశారు.. చివరకు 900 కోట్ల రూపాయల వరకు డబ్బులను పొగేసుకుని.. ఊడాయించారు.. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టారు. డిపాజిట్లను సేకరించేందుకు మొబైల్‌ యాప్, వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు. హైదరాబాద్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు..


రూ.25 వేల నుంచి రూ.9 లక్షల డిపాజిట్‌ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11 నుంచి 22 శాతం రాబడిని ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. డిపాజిటర్లకు రాబడిని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15న నాటికి ఈ స్కీమ్‌ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసేశారు.

వీరు పెట్టుబడుల పేరిట 6వేల 979 మంది నుంచి రూ.17వందల కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. భారీ ఎత్తున వసూలు చేసినప్పటికీ, తిరిగి డిపాజిటర్లకు రూ.850 కోట్లు మాత్రమే చెల్లించారు. వసూలు చేసిన డబ్బును 14 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంపెనీ జనవరి 15న బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు లబోదిబోమన్నారు.


బాధితుల ఫిర్యాదు అనంతరం పోంజీ స్కామ్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ కోసం గాలిస్తున్నారు

Also read

Related posts

Share via