SGSTV NEWS
CrimeTelangana

ప్రియుడితో అక్క పరార్.. చెల్లెలితో పెళ్లికి సిద్ధమైన వరుడు.. చివరికి ట్విస్ట్ అదిరింది..!

ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు..! ఒక సమస్య నుంచి బయట పడుదామనుకుంటే. మరొక దాంట్లో ఇరుక్కున్నారు. కుటుంబ పరువు కాపాడుకోవడం చేసిన పని.. మరింత పరువు పోయేలా చేసింది. అక్కా, చెల్లి ఇద్దరి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. మొత్తంగా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు తలెత్తుకోకుండా అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఓ కుటుంబం వివాహ సంబరాలు జరుపుకుంటోంది. తీరా పెళ్లి సమయానికి పెళ్లికూతురు కనిపించకుండాపోయింది. ఆరా తీస్తే, ప్రియుడితో పారిపోయింది. అయితే పరువు పోతుందని భావించిన పెళ్లికూతురు తల్లిదండ్రులు, ఆమె స్థానంలో చిన్న కూతురుని ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధం అయ్యారు. చివరికి ఆమె మైనర్ అని తేలడంతో రంగంలోకి దిగిన అధికారులు పెళ్లిని ఆపేశారు. దీంతో వరుస సంఘటనలు ఆ ఇంట తీరని దుఃఖాన్ని మిగుల్చాయి.

నారాయణపూర్‌కు చెందిన యువతికి హుస్నాబాద్‌కు చెందిన ఓ యువకుడితో 15 రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, గ్రామస్తులు హాజరయ్యేలా ముహూర్తం కూడా ఖరారయ్యింది. కానీ వివాహానికి ముందురోజు వధువు తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

యువతి తల్లిదండ్రులు షాక్ గురైయ్యారు. పెళ్ళి కొడుకుకి అన్ని విధాలుగా నచ్చజెప్పి, అదే రోజు, అదే ముహూర్తానికి వారి చిన్న కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధం అయ్యారు. గోప్యంగా పెళ్లి చేద్దామనుకున్నా సమయానికి పెళ్లి మండపానికి అధికారులు చేరుకోవడంతో అసలైన ట్విస్ట్ బయటపడింది. అయితే అమ్మాయి వయస్సు వివాహం జరిగే సమయానికి 18 ఏళ్ళు లేవని, గుర్తు తెలియని వ్యక్తి ద్వారా అధికారులకు సమాచారం చేరింది. వెంటనే స్పందించిన ఐసిడీఎస్ (ICDS) అధికారులు, పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు.

ఒక్కసారిగా పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు ప్రత్యక్షం అవ్వడంతో పెళ్లి మండపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అని కాసేపు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకంత ఆందోళనకు గురయ్యారు. రెండు కుటుంబాల వారిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. పరిస్థితిని అర్థం చేసుకున్న అనంతరం తల్లిదండ్రులకు మైనర్ల వివాహాలపై చట్టపరంగా వారికి అవగాహన కల్పించారు. బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం మైనర్ బాలికలకు పెళ్లి చేయడం శిక్షార్హం అనే విషయాన్ని వివరించారు.

ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను పట్టించుకోకుండా, సామాజిక ఒత్తిడితో పెళ్లిళ్లకు ఒత్తిడి చేయడమొక భయంకరమైన పరిణామంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ప్రేమతో సంబంధాలు ఏర్పరచుకునే యువతీ యువకులను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలన్నారు. అదే సమయంలో మైనర్లకు పెళ్లిళ్లు చేస్తే వారిలో శారీరక, మానసిక అభివృద్ధికి నష్టం జరుగుతుందని, విద్యాబ్యాసం ఆగిపోతుందని ఐసిడీఎస్ సిబ్బంది స్పష్టం చేశారు. చట్ట రీత్యా కూడా ఇది శిక్షార్హమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పారిపోయిన యువతీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also read

Related posts

Share this