October 16, 2024
SGSTV NEWS
sripada charitamrutam

sripada charitamrutam
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4

 

అధ్యాయము- 4      

    శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం



పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురమును ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి యిట్లనెను. “నాయనా! మాధవా! వత్సా! శంకరా! మనము ముగ్గురము ధ్యానస్థుల మయ్యెదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకొందుము. ఇది శ్రీవల్లభుల వారి ఆజ్ఞ గనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవము లోనికి వచ్చును. భవిష్యత్తులో హూణశకము వ్యవహారము నందుండును. ఈ రోజు హూణశకము రీత్యా 25 -5 -1336 . ఈ రోజు శుక్రవారం. సర్వశుభ యోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈ రోజు మన జీవితములో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూలశరీరమును ఇచ్చటనే యుంచి స్థూల శరీరముతో కురువపురము పోయెదను. ఒకే పర్యాయము నాలుగయిదు చోట్ల ఒకే సమయములో సూక్ష్మరూపములో విహరించుట నాకు బాల క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానములో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మశరీరముతో కురువపురము లోని వారి సన్నిధానమునకు చేరెదను.”





స్వామి అనుగ్రహ సౌలభ్యతా విధానము

పళనిస్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి “స్వామీ! మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్య మంగళ రూపమును దర్శించెను. మీకు సదా శ్రీవల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధమున్నది. మరి నాకు వారి నామమే గాని రూపము తెలియదు గదా! నేను వారిని ధ్యానించుట ఎట్లు?” అని వారిని అడిగితిని. అందులకు పళనిస్వామి మందహాసముతో, “నాయనా! శ్రీపాదుల యందు భక్తీ కలిగి యుండినచో సర్వమూ సిద్ధించును. కూర్మము తన బిడ్డను విడిచి ఎంతదూరములో నున్నను తన ఆలోచనా తరంగములతో బిడ్డను కాపాడును.



మార్జాలము తన కిశోరములను నోటితో కరచుకొని ఒక యింటి నుండి మరియొక యింటికి కొనిపోవును. కిశోరములకు ఎచ్చట సురక్షిత స్థానమనిపించునో అచ్చటనే వాని నుంచును. అట్లే తొలుదొల్త శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మకిశోర న్యాయమున పాలింతురు. కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిశోర న్యాయమున భక్తపాలనము చేయుదురు.



తదుపరి మర్కట కిశోర న్యాయమున భక్తపాలనము జరుగును. ఇందు కిశోరమునకు తన తల్లిని ప్రయత్న పూర్వకముగా అంటిపెట్టుకొనవలసిన అవసరమున్నది. ఇంకనూ పరిణితి సాధించిన పిదప తల్లిచేప వెంటబడి స్వేచ్చగా పయనించు పిల్లచేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శనభాగ్యమిత్తురు. శ్రీవల్లభులు అతిముఖ్యమైన భవిష్యనిర్ణయము ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మరూపములో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు. ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షనముననే కురువపురము పోయెదను. అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరుగబోవుచున్నది. అది కనులార గాంచెడి మహత్తరమైన అవకాశమును శ్రీదత్త ప్రభువులు దయచేసిరి.” అని పలికి వారు ధ్యానస్థులైరి. తదుపరి నేనునూ, మాధవుడునూ కూడా ధ్యానస్థులమైతిమి.

ఈ రకముగా ధ్యానము పది ఘడియల కాలము జరిగినది. అందరమునూ ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహోల్లాసముగా కనిపించిరి. నేనునూ, మాధవుడునూ శ్రీ స్వామి  వారిని తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ యీ విధముగా సెలవిచ్చిరి.





శివశర్మ గాధ – శ్రీపాద శ్రీవల్లభుల చింతనా ఫలితము

ఈ కలియుగము నందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురువపురము గ్రామము చాలా చిన్నది అయిననూ, అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు, సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మయనునతడు తన భార్య అంబికతో కురువపురము లోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురువపురము నందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతి రోజూ అతడు దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసికొని తిరిగి కురువపురం చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు. చాలా గొప్ప పండితుడు. అనుష్ఠానపరుడు. యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానము స్వల్ప కాలములోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక కుమారుడు మాత్రము నిలిచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడయ్యెను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శాల్యము కాజోచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముతో నిలుచుండెను. శ్రీస్వామి మందహాసముతో అతని మనసులోని దిగులును గమనించి యిట్లనెను. “శివశర్మా! యితర చింతలను మరచి నిరంతరమూ నన్నే ధ్యానించు వారికి నేను బానిసను. నీ అభీష్టము ఏమిటో తెలుపుమనెను.” అందులకు శివశర్మ “స్వామీ! నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావలెనని అపేక్షించితిని. నా ఆశలన్నియును వమ్ము ఆయెను. నా కుమారుడు పరమశుంఠ అయ్యెను. ఘటనాఘటన సమర్థులగు మీకు వానిని పండితునిగాను, ప్రయోజకునిగాను చేయుట కష్ట సాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము.” అనెను.





అందులకు శ్రీపాదులు, “నాయనా! ఎంతటి వారికైననూ పురాకృత కర్మఫలములు అనివార్యములు. సృష్టి అంతయునూ అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడచుచున్నది. స్త్రీలకూ పూజా ఫలముగా భర్త లభించును. దాన ఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడునూ సత్పాత్రదానము చేయవలెను. యోగ్యులు కాని వారాలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో, వాడు చేయు పుణ్య కార్యముల వలన కలుగు పుణ్యములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో, వాడు చేయు పాపకార్యముల వలన కలుగు పాపములో కొంతభాగము అన్నదాతకు వచ్చును. దానము చేయునపుడు అహంకార రహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమె అది సత్ఫలితముల నిచ్చును. పూర్వ జన్మ కర్మ విశేషముననే మండబుద్ధుడు నీకు కొడుకాఎను. మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్యునిమ్మని కోరిరి. పూర్ణాయిష్యునొసంగితిని. వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడయిన పండితునిగా చేయవలెనన్న కర్మసూత్రము ననుసరించి నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమయినా ఎడల నేను వానిని యోగ్యుడయిన పండితునిగా చేసెదనని” అనిరి. దానికి శివశర్మ “స్వామి! నేను వృద్ధావస్థలో ప్రవేశించితిని. నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు, వక్తా అయిన యెడల నాకు కావలసినది ఏమున్నది?” అనెను. అంతట ఘటనాఘటన సమర్థులైన శ్రీచరణులు, “సరే! నేను ఆనతికాలములోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో ధీశిలానగరమందు నింబ వృక్ష పాదమున నుండు భూగుహలో తపశ్చర్యలో కొంత కాలముండెదవు. ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠ దేశమున జన్మనొందెదవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమున తెలియనీయకుము.” అని ఆజ్ఞాపించిరి.

శ్రీపాద శ్రీవల్లభుల భావిజన్మావిష్కరణ

ఆనతి కాలముననే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండెడిది. ఇరుగు పొరుగువారు చేయు పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడయిన ఆ బ్రాహ్మణబాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకొనదలచి నది వైపునకు పరుగెత్తసాగెను. నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకొనదలచి అతని వెంట పరుగెత్తసాగెను. పూర్వ జన్మ వశమున దారిలో శ్రీపాదులవారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నమూ నుండి విరమింపజేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేష జీవితమును గడుపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజాఫలమును గూర్చి వారికి విస్తారముగా తెలియజేసిరి. తరువాత జన్మమున అంబిక తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు గనుక తామే ఆమెకు మరు జన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి.





నృసింహ సరస్వతి జన్మసంకల్పము

సమస్త కల్యాణగుణములకు నిలయమైన ఓ వాసవాంబికా! “నీ సంకల్పమే నెరవేరు గాక! నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా యీ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము యీ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే యుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మము నుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది, ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను. తదుపరి కదళీవనము నందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోను, సిద్దపురుషుల రూపములతోను అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను, మహిమలను చేయుచూ లోకులను ధర్మకర్మానురక్తులుగా చేసెదను.” అని అనిరి.

యుగములు మారుకొలది మానవులు అల్ప శక్తివంతులగుచుందురు. అందుచేత పరతత్త్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగి వచ్చుచుండును. ప్రభువు శరీరధారియై అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్త్వము క్రింది స్థాయిలలోనికి దిగి వచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమున శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగము నందలి మానవులు ధన్యులు. కేవలము స్మరణ మాత్రముననే దత్త ప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో, శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమసత్యము. స్మరణ, అర్చన మొదలయిన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యమేర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నియునూ శ్రీపాద ప్రభువుల చైతన్యము లోనికి ప్రవేశించి, వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రితులలోనికి ప్రవేశించును.

శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీస్నానములో పోగొట్టెదరు లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసివేసెదరు. తాము స్వయముగా తపమాచరించి, ఆ తపః ఫలమును తమ ఆశ్రితులకు ధారపోసేదరు. తాము అవసరమని భావించిన యెడల జడస్వరూపమైన కర్మతత్త్వమును శాసించి తమ శ్రీ చరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్రరూపమున చేయుదురు. కావున, వారి పాదుకలను ఆశ్రయించినవారు, తమకు తెలియకుండగనే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు.





శ్రీ పళనిస్వామి యీ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెలిబుచ్చుతూ యీ విధముగా ప్రశ్నించ సాహసిన్చితిని. “స్వామి! ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీ గురుసార్వభౌములు ఏ విధముగా పారద్రోలెదరో తెలుప ప్రార్థన.”

“నాయనా! శంకరా! ఖగోళము నందలి గ్రహములు జీవుల యెడ మిత్రత్వ శత్రుత్వములను కలిగియుండవు. మానవుడు జన్మించినపుడు వాని ప్రారబ్దకర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనియించి, ఆయా గ్రహాచారముననుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మ కిరణములు అశుభమును కలిగించునవి అయినప్పుడు, వాటి దోషనివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించానపుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వలన కూడా ఉపశమనము కలుగనపుడు శ్రీ గురుపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి, చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను, అశుభములను ఒసంగుచుండును. ప్రతి గ్రహమునకును మానవ శరీరము నందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహబాధలు సంభవించునపుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వచైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించునపుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనలవలన కలుగు ఆకర్షణ వికర్షణలలో తేడాలు కలుగును. ఇంత దనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధు వియోగము, కుటుంబము నందలి సభ్యులలో వివాదములు, ఆకర్షణశక్తి తగ్గుట మొదలయిన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వ శక్తులవలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పని చేయుచుండుట స్థితి కార్యము. కాలము శక్తి స్వరూపము. కొంతకాలము గడచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రముననుసరించి ఫలితముల నిచ్చుచుండును. మానవులు దైవ భక్తీ కలిగి జప తపములు చేసిన యెడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తపఃఫలితమును ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్ట దాయకములగు స్పందనలు మనుష్యుని తరువాత మనుష్యుని పీడించుటకు బదులు అవి ఎక్కడనుండి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్ప మాత్రము పుణ్య కార్యమును చేసిననూ విశేష శుభ ఫలితము నిచ్చుటను అనుగ్రహమని అందురు. నాయనా! క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి, స్థితి, లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులోభవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబవృక్ష పాదమున నున్న భూగృహములోని నాలుగు నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశ్యములు దృష్టిలో నుంచుకొని నీకీ అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహాత్తరమైనవి. నిగూఢ ప్రయోజనము కలిగినవి. అంతే కాకుండా ఇతరులకు చెప్పకూడనివి. దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి యిచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నలలో మెలగును. వారికి వారే ప్రమాణము. వారికి వారే సాటి. విశ్వ నియంత యొక్క విభూతులు, యోగసిద్ధులు అమెయములు. పరిమాణములకును, కొలతలకును పరిమితులకును అందని విషయము.”



శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనందకందళితమైనది. నేను ఉడుపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు కురువపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములయిన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములనన్నిటిని గ్రంథస్థము చేయవలెననియు, శ్రీగురు సార్వభౌముల అనుమతిని పొందవలెననియు, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీచరణులను యీ విషయమై అభ్యర్థించవలెననియు అనుకొంటిని.

శ్రీ పళనిస్వామి నా మనసులో భావనలను అవలీలగా అర్థము చేసుకొని “నీ మనసులోని భావనలను అవగతము చేసుకొంటిని. భవిష్యత్తునందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింప దలచితివి. శ్రీపాద శ్రీవల్లభులవారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని” పలికెను. అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగెను.

శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు, శ్రీపాదుల, శ్రీ దత్తాత్రేయుల, శ్రీ నృసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ఠ




శ్రీ పళనిస్వామి యిట్లనిరి. “నాయనా! మాధవా! నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహగృహము నీలోని సర్వ శక్తులనూ ఆకర్షింపబడిన స్థలము అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగా నున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్ఠలోనున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్టింపబడును. పాదుకలు ప్రతిష్టింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలము నందు శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైన శ్రీదత్తాత్రేయులు, వారి తదుపరి అవతారమైన శ్రీనృసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్టింపబడును. ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును.” అని తెలియజేసిరి.

అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరి. మా గుహకు దగ్గరలోనే యున్న నవయువకుని శవమును బైటికి తీసిన తరువాత ప్రణవమునుచ్చరించ సాగిరి. “శ్రీపాదరాజం శరణం ప్రపద్యే” అను ఘోషతో వ్యాఘ్రేశ్వర శర్మ అరుదెంచెను. శ్రీపళనిస్వామి నవయువకుని శవములో ప్రవేశించిరి. అంతట వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు వ్యాఘ్ర రూపములో నున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయెను.

నూతన శరీరములో ప్రవేశించిన పళనిస్వామి యిట్లు ఆజ్ఞాపించిరి. “మీరు తక్షణము యిచ్చట నుండి పోవలెను. నాయనా! మాధవా! నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మశరీరములో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు. యీ జన్మకు నీకు అది చాలును. నాయనా! శంకరా! నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవా! మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగును గాక!”

అంతట మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిమి. శ్రీచరణుల లీలలకు అంతెక్కడ!



శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

 

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1 | sripada srivallabha charitamrutam sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2 sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3  

Related posts

Share via