SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -8


                  అధ్యాయము 8
            దత్తావతారముల వర్ణనము 

బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే

ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తీ చేసుకొనిన తదుపరి యిట్లు చెప్పనారంభించెను. “నాయనా! శంకరభట్టూ! ఆత్మ సాక్షాత్కారమగునపుడు పదహారు కళలూ తమతమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము, కర్మలు అన్నియునూ బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైననూ బ్రాహ్మణుడే యగును. ‘ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానావిధమైన నామములు’ అనువాటిని పదహారు కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశకళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము.ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును.

విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనునది విశ్వములోని సమస్తప్రాణము. సూక్షాత్మ, హిరణ్యగర్భ నామములతో యిది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవునియోక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తిశరీరమని పేరు. ప్రాణమయచైతన్యమును సరి చేయుట ద్వారా భౌతికసంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమె స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములేర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములేర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన యెడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచనాస్రవంతి క్రమబద్ధము చేసి, నియంత్రణలో ఉంచినయెడల ఆలోచనా ప్రతిబింబరూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యధావిధి నాచారించుచూ, ఆయా కర్మకలాపములలో పధ్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన యెడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంకెల పదహారు రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క యింద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమౌతుంది. సమాధి స్థితిలో ఉన్నయోగికి ఆత్మా సాక్షాత్కారమైనపుడు పదహారు కళలూ తమ తమ భూతములలో లీనమౌతాయి. యోగి యొక్క భౌతిక శరీరమండలి యింద్రియములలోని శక్తులు విశ్వాంతరాళం లోని భూతములలో లీనమౌతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు.అహం నశించనిదే మోక్షం కలుగదు

శ్రీపాదులు షోడశకళాప్రపూర్ణులు


కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరములోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశకళా పరిపూర్ణమైన మహాయుగావతారమను విషయమును బోధ చేయుచుండిరి. తమ పదునారు సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత పదునాలుగు సంవత్సరములు కురువపురము, తదితర ప్రాంతముల సంచరించిననూ వారి వయస్సు మాత్రము 16 సంవత్సరములందే నిలచియుండెను.

దత్తాత్రేయుని షోడశావతార నామాలు

16 సంఖ్యకు మరియొక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయస్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చి యుండిరి. అవి (1) యోగిరాజు, (2) అత్రివరదుడు, (3) దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, (4) కాలాగ్ని శమనుడు, (5) యోగిజనవల్లభుడు, (6) లీలావిశ్వంభరుడు, (7) సిద్ధరాజు, (8) జ్ఞానసాగరుడు, (9)విశ్వంభరావధూత, (10) మాయాముక్తావధూత, (11) ఆదిగురువు, (12) సంస్కారహీనశివస్వరూపుడు, (13) దేవదేవుడు, (14)దిగంబరుడు, (15) దత్తావధూత, (16) శ్యామకమలలోచనుడు.

శ్రీ దత్త ప్రభువులు భోగమోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను నాల్గు వేదములు నాల్గు కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలనూ పోగొట్టగలిగిన వేదములే, అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు, సప్తర్షులకు కూడా అసాధ్యము.

పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించునపుడు మాతృ గర్భము నుండి తల ఒక పర్యాయము బైటికి వచ్చి పరిసరములను పరికించి, తిరిగి గర్భస్థమయ్యెను. అపుడు దేవతలు, ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు.


శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా రెండుసార్లు జన్మించుట వలన వారు ఆజన్మద్విజులు. ఆజన్మబ్రహ్మజ్ఞానసంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ, అనంత, అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయెను. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము గాక, వారికి అతీతముగా నున్న ఒకానొక ప్రత్యేక తత్త్వము. అందువలన వారు త్రిమూర్తులకతీతమైన నాలుగవ తత్త్వమని సూచించుటకు చతుర్థీ తిథినాడు జన్మించిరి. సృష్టి యందలి ప్రవృత్తి గణములు, నివృత్తి గణములు రెండింటికీ అధిపతి అయిన గణేశ తత్త్వమని సూచించుటకు గణేశ చతుర్థీ దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళ గ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైనయెడల జీవులకు అనేక అమంగాలములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిట్టా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేషఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త గనుక, హరిహరాత్మజుడైన అయ్యప్పస్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి, వారు విశ్వప్రభువుననియూ, దర్బారుచేయుటకు వచ్చిన చక్రవర్తిననియూ తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మసూక్ష్మములు లేవు. ధర్మసంకటము లేర్పడినపుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపధము దర్శనీయమగును.

శ్రీదత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటిదేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్తదేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషిపూజ చేయవలయును. విష్ణు ముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రా ముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వ యందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టియందలి సమస్త స్త్రీదేవతాశక్తులును శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులును శ్రీపాదుల వారి కుడిభాగము నందు కలవు. 

తిరుపతిలో ఏడుకొండల మీద వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే! ‘వేం’ అనగా పాపములను ‘కట’ అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. ‘వేం’ కారము అమృతబీజము. ‘కట’ అనునది ఐశ్వర్యబీజము. అందువలన వేంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయునూ, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులును అభిన్నమూర్తులు.

అప్పుడు నేనిట్లంటిని. “అయ్యా! తిరుమలదాసూ! వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు వచిన్చిరి. శ్రీపాదవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది.

బ్రాహ్మణ లక్షణములు

అంతట తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించెను. “నాయనా! బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన యెడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన యెడల అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగువాటికి లోనైన యెడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైననూ లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారమువలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేకమార్పులకు లోని చండాలత్వము నొందును. అపుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సువలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మ  సిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వము నొందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్చ్వరుడు మూడురాశులలో ప్రయాణము చేయు 7 1 /2 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులు చెందును. పాత జీవకణములు నశించును. క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయునూ మనుష్యులకు తెలియకుండగనే జరుగుచుండును.

క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వ్రుత్తి అయిన కృషి, గోగణపోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన యెడల అది తీవ్ర దశకు వచ్చిన యెడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమునూ నిలువదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకులోనై వైశ్యత్వము నొందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తి నవలంబించిన పరశురాముని వలెనగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా! జన్మతః శూద్రుడనయిన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానము పొందలేదా? జన్మతః శూద్రుదయినా వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడుగా గాని, బ్రాహ్మణుడుగా గాని మారవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనయిన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. జన్మతః బ్రాహ్మణుడయినవాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింప వచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్లు కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చి యుండిరి. శంకరభట్టూ, నీవు మా యింత ఆతిధ్యమును స్వీకరించుచున్నావు. మా యింటి భోజనము బ్రాహ్మణ భోజనమే!

మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు బుద్ధి అను వాటియొక్క నియమ నిబంధనలచేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మసాక్షాతారం పొందిన యోగికి పూర్వ జన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటి ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారము జరుగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనపుడు శ్రుతికర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దానియొక్క మాయాజాలములన్నియునూ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూలదేహము కర్మఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూలదేహ స్పృహ లేనపుడు ముక్తావస్థలోనే యుండును. పరమాత్మ సిద్దావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును. యోగికి యీ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు, యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమయిపోవలెను.

శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రములోని శ్రీ మల్లిఖార్జునలింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి, సూర్యమండలము నుండి శక్తి పాతమును చేసియున్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన యీ శక్తికి శాంతి జరుపవలెను. లేనియెడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా, అర్చనలు జరుపువారు అందరునూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీబాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజలసమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లిఖార్జునలింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు యీ శక్తిపాతమునకునూ అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలములో శాంతి జరిగినది. వేలాదిమందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంత తత్వములో నిలచినపుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును.

అయితే పీఠికాపురములోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరుగవలెనని అన్నదానము జరుగవలెనని సూచించిననూ, అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి.

కర్మ రహస్యము

నిరంతరమూ శ్రీపాదుల వారి స్మరణలోనూ, ధ్యాసలోనూ ఉండెడి యీ పరిసర ప్రాంగణమంతయునూ శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నియునూ విషపూరితములై యున్న కారణమున, కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిధ్యమును స్వీకరించరయిరి. దీనిలోని రహస్యము ఇది సుమీ!

జీవులు తమ పరిణామ క్రమములో గాని, విపరిణామ క్రమములో గాని కర్మసూత్రముననుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా! అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరినామక్రమము యొక్క చివరిదశలో కురువపురములో శ్రీపాదుల దర్శనభాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగల్గెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడయినను అనేక సంవత్సరముల వరకూ శ్రీపాడులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన, గుర్తించిన తదుపరి కూడ యింకనూ ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొందసాధ్యము కాలేదు.

అప్పుడు శంకరభట్టు ఇట్లదిగెను. “అయ్యా! మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతీ జాతికిని ఒక ఆత్మ ఉండునా? పార్వతీ దేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి?”

అంతట తిరుమలదాసు యిట్లనెను. “ప్రతి జాతికిని ఒక ఆత్మ యుండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీదత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకోనునట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగియుండి జీవించి యుండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వము నందు యీ వ్యక్తుల యొక్క వివిధములయిన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును. ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును. ప్రతి దేశమునకునూ ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా యీ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధముగా హిమవన్నగము నందు అభిమానము  గల దేవతాశాక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన యెడల జీవుల శుభాశుభ కర్మలననుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము.


సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులును, తమతమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమానదేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాదవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యెదరని నీతో చెప్పితిని. కోటానుకోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అనువులోను విలీనమయ్యెదరు, వారు సర్వాంతర్యామి గదా! తిరిగి విలీనమగుట అనగా నేమి అని నీవు అడుగవచ్చును. వారు సర్వాంతర్యామిగా నున్ననూ, వారియొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటానుకోట్ల బ్రహ్మాండములునూ ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశ్యముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామదశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయులవారు అవతరించెదరు. ఇనుమును సూదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడియున్నపుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమొనర్చి సృష్టి యందలి ప్రతీ అణువును తమవైపు ఆకర్షించుకొని విశ్వపరిణామక్రమమునకు వినూత్న దిశను యివ్వదలచినపుడు మాత్రమే యీ విధమైన అవతారము వచ్చును.

పంచకన్యల వివరణ

శంకరభట్టు తిరుమలదాసును ఇట్లడిగెను. “అయ్యా! అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనం” అని చెప్పుదురు గదా! ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుట లేదు. వివరింప ప్రార్థన.


అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. ‘అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయమును పన్నును. కోడి రూపమును ధరించి కొక్కొరోకో అని అరిచేను. వేకువ జాముఅయ్యెనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు  కలవాడు గనుక అహల్య వ్యామోహమున నున్న అతని తీవ్రమనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్యా రూపముయోక్క శరీరమునందలి జీవాణువులన్నియు దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతట అహల్య, “ఓ తెలివిమాలిన మునీ! ఎంత పని చేసితివి?” అనెను. అహల్య గౌతముని కంటెనూ అధ్యాత్మికముగా ఉన్నత స్థితి యందుండెను. అహల్యా శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యమునొంది శివార్చనమున స్వస్థుడాయెను. అహల్య మనశ్శక్తి జడత్వమొందెను. దానితో ఆమె శరీరము కూడ జడత్వమునొంది పాషాణమయ్యెను, శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాపవిమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము.

శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. అయిదు రూపములయిననూ, అయిదు మనస్సులు ఉన్ననూ, వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే! ఇదియొక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ.

అసలయిన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్నిప్రవేశము చేసినపుడు యిద్దరు సీతాలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము.

భూచక్రమునందలి 12 రాశులలోను 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యౌవనవతిగా నుండగా గురుబ్రహ్మ అభిమాన దేవతయైన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యౌవనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మవిరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినపుడు భర్తృభావమే కలిగెడిది కాదు. ఆమెలో తన యెడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనః ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై యుండెను. ఈ విధముగా పరిణామస్థితి నొందిన తారాదేవి, పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారచంద్రుల కలయిక ధర్మవిరుద్ధము కాలేదు. సృష్టినియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టివచ్చుట చంద్రుని ధర్మమూ. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మవిరుద్ధమగును. ధర్మవిరుద్ధమైనది ఏదీ విచ్చిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయనా! ఈ ధర్మసూక్ష్మము ననుసరించి తారాదేవి మహాపతివ్రత.





భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. ‘చెడు జరుగునపుడు సాధ్యమైన యెడల దానిని నిరోధింపవలెను. దానిని నిరోధింపవలెను లేదా ధర్మవిరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను.’ అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది ఫక్కున నవ్వెను. అంతట భీష్ముడిట్లనియె. ‘ద్రౌపదీ దేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టుపట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును యిప్పుడు శరీరము నుండి బయల్వెడలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మష రహితముగా నున్నది. సత్యము బోధపడినది. ‘ అనెను.

జీవి పరిణామదశలో అనేక జన్మలెత్తుచుండెను. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మింపవచ్చును. మానవజన్మ లేకుండా పశుపక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచలస్వభావురాలైన ఒక భార్య, దుష్టప్రవృత్తిగల ఒక భార్య, మృదుస్వభావముగల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించెను. మృదుస్వభావముగల భార్య విభీషణుడుగా జనించెను. కల్పాన్తరము నందు వీరు మువ్వురునూ, మండోదరి పురుషుడుగా జనిన్చినపుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్యకాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగానయ్యెను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యెను. వాలికి భార్యగా నున్నపుడున్న జీవాణువులు, రావణుని భార్యగా నున్నపుడున్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా నున్నపుడున్న జీవాణువులు వేరువేరుగా నున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే! “

అప్పుడు శంకరభట్టు ఇట్లడిగెను. “అయ్యా! స్త్రీలకూ ఒకే భర్తతో నుండవలెననియూ, పురుషులు ఏకపత్నీ వ్రతులాయి ఉండవలెననియూ చెప్పుదురు గదా! బహు భార్యత్వము కాని, బహు భర్తృత్వము గాని నిందనీయములు కాదా?”

కర్మచక్ర పరిణామము

అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. “నీవు చెప్పునది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసినయెడల సప్తజన్మముల బాలవైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు నలుగురయిదుగురు స్త్రీలను వివాహమాడిన యెడల మరు జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ నలుగురయిదుగురు స్త్రీలు తమ కామవాసనలు, సంస్కారములు నశింపనియెడల పురుష జన్మనెత్తి ఆ స్త్రీ ని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచారదోశము కలుగును. అట్లుగాక వేరువేరు జన్మములయందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన యెడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచాక్రమునండు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమూ నాచరింపవలెను. పురుషజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మము నాచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుషజన్మకు గాని యిటు స్త్రీ జన్మకుగాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమనునది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచూ మనస్తాపమునొందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి, పదిమందితో కలిసి దానిని భుజించెననుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధననుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలములోనిక్షిప్తమై యుండును. నాయనా! వాయుమండలము నందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మలవలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక, తనను తినిన పదిమంది మానవులను హింసింపవలెనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మనెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు, ప్రతీ చర్యకును, ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణమునలవరచుకొనవలెను. సాత్వికుడు మేకను చూచిననూ, దాని మాంసము తిననొల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయిననూ సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన యెడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును.

పీఠికాపురవాసుల సాంఘాతిక పుణ్యమును, సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీ దత్తునిగా గ్రహింపక మరింత అశుభఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరదిన్చుచూ, శ్రీపాదవల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్ధంకానపుడు మౌనము వహించుట మంచిది, అంతే కాని దివ్యభవ్యమైన శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచూ పాదములకు మేకులను కొట్టువారునూ, శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక, శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీదత్తనామస్మరణమున సర్వమనోరథములు అయాచితముగా, అప్రయత్నముగా సిద్ధించును. శ్రీవల్లభుని నిందించు పాపజనులకు  విచిత్ర పద్ధతులలో విఘ్నములు, అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్ని స్వరూపము. వారు ధరించునది అగ్నివస్త్రము. వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి? ఎన్ని కల్పములు గడచినవి? ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి? కాని శ్రీదత్తులవారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తూ శ్రీపాద శ్రీవల్లభులే! సృష్టిలోని ప్రతీ అణువణువునూ, యీ పరమసత్యమునకు సాక్ష్యము పలుకును.

స్వయంభూదత్త పునఃప్రతిష్ట


శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్తసిద్ధుడు. అతడు తిట్లు, శాపనార్థముల మూలమున ఆశీస్సులనందజేయు వింత సాధువు. అతడు ఎవరినయినా పొగిడిన యెడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీనించినట్లే! ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అపుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలానదిలో నున్నాడని తెలిపెను. అంతట ఏలానదిలో ప్రయత్నముచేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభ ముహూర్తమున అపరసర్వమంగళాదేవి అయిన సుమతీ మహారాణియు, బ్రహ్మతేజో విరాజితులైన అప్పలరాజశర్మయు పునఃప్రతిష్టించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి.

విద్యారణ్యుల ఆవిర్భావము

ఆలయములో పునఃప్రతిష్ట జరిగిననాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ యింటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లెయనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము రెండవ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానులు భుజముపైకెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచూ సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యెను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు “మాధవా! నాకు 16 సంవత్సరములు వయస్సు వచ్చునపుడు నీ కోరికమేరకు బుక్కరాయుడుచే హిందూసామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు, బుక్కరాయునికి నీవు తోడై యుండుము. నీవు విద్యారణ్యమహర్షి నామమున విఖ్యాతుడవయ్యెదవు గాక! నీ సోదరుడైన సాయణాచార్యునింట రాబోవు శతాబ్దములలో గోవిందదీక్షితులు జనించును. ఆ గోవిందదీక్షితుడు ఎవరో కాదు నీవే! రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవు గాక!” అనిరి.


అంతట ఆ సిద్ధుని కన్నులవెంట ఆనందబాష్పములు జలజలరాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదులవారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత? అనెను. అంతట శ్రీపాదులిట్లనిరి. “నీవు శృంగేరీపీఠము నధిష్టించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యెదవు. నీ శిష్య పరంపరలో మూడవవాడిగా నీవే కృష్ణసరస్వతీ నామమున జనించెదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యము మిక్కుటముగా నున్నది. కావున నేను నృసింహ సరస్వతీ నామమున తిరిగి అవతారమెత్తునపుడు నీవు కృష్ణసరస్వతీ నామమున నాకు కాశీలో సన్యాసదీక్ష నిచ్చెదవు. దీనికి కాశీవిశ్వేశ్వరుడునూ, అన్నపూర్ణామాతయునూ సాక్షి. నీవు సన్యాసిధర్మమును పునరుద్ధరింపవలెను.”

వశిష్ఠ, శక్తి, పరాశరసత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులును, ఋగ్వేదులును అయిన వాజపేయయాజుల మాధవాచార్యుడు, విద్యారణ్యమహర్షిగా వినుతిగాంచి తీరును. నాయనా! రేపు నీకు మరిన్ని విషయములను చెప్పెదను అని తిరుమలదాసు యీ రోజు వృత్తాంతము ముగించెను.

      శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

 

ఇవి కూడ చదవండి : శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1 | sripada srivallabha charitamrutam sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2 sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -5 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -6 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.. అధ్యాయం -7   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -8

Related posts

Share this