SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -17

                    అధ్యాయము 17

           శ్రీనామానందుల వారి దర్శనము

నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితము లేనిదానివలె కన్పించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళుచేతులు వణక నారంభించినవి. యిద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగుపరుగున వచ్చి నా కాళ్ళపైబడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయూ అయోమయముగా నుండెను. దారిబత్తెము కూడాలేని బక్కబ్రాహ్మణుడనైన నేను పరాయిస్థలములో పరాయి వ్యక్తుల బారినుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, “అమ్మా! నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారినుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది.” అని అంటిని.



ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే గాక తమ బారినుండి యీ స్త్రీని రక్షించెదనని ధృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి, వారు “ఓ బక్కబ్రాహ్మణుడా! మేము యీ దురాచారిణిని చంపదలచితిమి. నీవు యీమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన యెడల నిన్నుకూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డురాకుము.” అనిరి.

నాలో ఏదో అదృశ్యశక్తి ప్రవేశించినట్లనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటినుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడెడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టి వేయునవి అయి ఉన్నవి. అంతట నేను, “బ్రాహ్మణజన్మనెత్తి సిగ్గులేకుండగా గతరాత్రి ఆవును వధించి, ఆ మాంసమును భుజించి, కల్లును ద్రావి, సకల దురాచారములతో కూడిన మీకు నన్నునూ, యీ నిరపరాధియైన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పనికాదు. నేనన్నింటికిని సిద్ధముగనే యుంటిని. మీయందు జాలితో పలుకుచున్నాను. మీరు యీ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠివ్యాధి సోకినవారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్ఠివ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారయిన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే యీ ఔషధమును తయారు చేయు విధానము అందరికినీ తెలియదు. కామవాంఛను అణచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలెనని మీరు కోరుకున్నచో యీ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి యీ మాటలను పలుకుచున్నాను.” అని పలికితిని.



నా మాటలు విన్న యిద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము! నేను పలికిన కొన్ని పలుకులు వారి గతజీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిషము యందు ఏమాత్రమూ పాండిత్యములేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, “అయ్యా! మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు, అయిననూ మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము యిర్వురమునూ అన్నదమ్ములము. బ్రాహ్మణజాతిలో జన్మించిననూ, బ్రాహ్మణధర్మములు మాలో పూర్తిగా లుప్తమయినవి. సర్వభ్రష్ఠులమయితిమి. గోమాంసభక్షకుల తో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోను మేము సర్వభ్రష్ఠులమైతిమి. ఒక గుట్టమీద పద్మాసనములో కూర్చొన్న యీమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానయిననూ ఆమెను అనుభవింపదలచితిమి. అదేమిచిత్రమో గాని, ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శనభాగ్యము మాకు కలిగినది.” అనిరి. అంతట నేను “ఏది మంచి, ఏది చెడు అను వివేచననుచేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించుచుండెను. మనము మంచిదారిలో నడచిన యెడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన యెడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసివచ్చును. ఈయమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమయిన కోరికలతో యీమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో, క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్తనందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తిస్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుతకాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యీ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియునూ కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మా! నీ వృత్తాంతమును ఎరిగింపుము.” అని ఆమెనడిగితిని.





అంతట ఆమె, “అయ్యా! తమరు నన్ను యీ పాపాత్ముల బారినుండి రక్షించితిరి. మీరు నాకు పితృసమానులు. నేను సద్బ్రాహ్మణ  వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింపమొదలిడెను. యౌవనసంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించు ఆనందించుటయనిన సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదేపదే చెప్పుచుండును. నేను సుమంగళీచిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన విటుని కోసమై వేచియుంటిననియు, అలంకరణరహితముగానున్నచో విధవరాలువలె అమంగళముగా ఎందులకు కన్పించుచున్నావనియు, గృహమునందలి చిన్న పిల్లలను మురిపెము చేయునెడల నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసిననూ నీవు చాల ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగుపొరుగు వారు ఆనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన యెడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచూ, ఆ మంత్రాధిష్ఠాన దేవత ప్రీతికొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్ననూ అత్తగారుగాని, మామగారుగాని యింటియందున్న తక్కిన పెద్దలుగాని నా భర్తను పల్లెత్తుమాట అనరు. ఈ భూలోకమునందు నరకమనునది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడచుచుండెను.” అని తెలిపినది.

ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడేతెంచెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని మా యింటికాహ్వానించిరి. అతడు ఏవేవో లెఖ్ఖలు వేసి, చిత్రవిచిత్రములయిన పూజలుచేసి, “ఈమె నష్టజాతకురాలు. అనేక అమంగళయోగములు కలది. ఆ యోగప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను యింటనుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు, పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతానయోగము కలుగును.” అని చెప్పెను.

దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలును, యింటిలోని వారును, నా భర్తయును నన్ను యింటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరములేక కనీసము పుట్టినింటికయిననూ కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా యింటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్ఛమైన తన కామవాంఛకు నన్ను బలిచేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తికొలది విసరితిని. అది వానినెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధీ! నేను స్త్రీనైయుండి గత్యంతరములేని పరిస్థితులలో బ్రాహ్మణహత్య చేసితిని. నా మనస్సు మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయిననూ నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారయిననూ అన్నదమ్ములును, వదినెలును, మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకులేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామరజనము చూచిరి, కాని వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇంటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయెదను గాక! యని తలచి దారీతెన్నూలేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహుదప్పికగానుండెను. కాసారములోని నీరుత్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షమొకటుండెను. ఔదుంబరము దత్త ప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమను విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్షమూలమునందే గాఢనిద్రలోనికి జారుకుంటిని. కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళుతెరచి చూచునంతలో రెండు నాగుపాములు నాకు రెండు వైపులా కాపలాకాయు కావలివాండ్ర వలెనుండెను. నేను ఆ రెండు నాగుపాములకునూ నమస్కారము చేసితిని. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి రెండునూ ఎటోపోయెను. నేను దత్తదిగంబర ! దత్తదిగంబర! జయగురుదత్త! దత్తదిగంబర! అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబరవృక్షఛాయలో కూడనుంటిని. నేను శ్రీదత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను.

శ్రీనామానందుల వారి వర్ణనము

నా దత్తనామస్మరణమును తన్మయత్వముతో ఆలకించుచూ దారివెంట పోవుచున్న బాటసారి యొకడు మేడిచెట్టుఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను “ఓయీ! నీవు ఎవ్వడవు? మర్యాదగా యిచటనుండి వెంటనేపొమ్ము. నీవు పోకపోయినచో యిచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నిన్ను చంపివేసెదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహనామాంత్రికుని హతమార్చితిని.” అంటిని.



అందులకు ఆ నూతనవ్యక్తి చేతులు జోడించి, “అమ్మా! నేను రజకకులమునందు పుట్టిన రవిదాసు అనుపేరుగల దత్తభక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుండును. శ్రీగురుదత్తులు యీ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురము నందు విరాజిల్లుచున్నాడు. ఎంతటి దూరదూరములలోనున్న దత్తభక్తులకైననూ తాను యీ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలావిశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము! నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు యిష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే యున్నది. నేను నా బంధువులయింటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను.” అని పలికెను.

అంతట నేను “నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పెడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరయి ఉన్నది అని విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో యీ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువుచేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదులవారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము యీచోటినుండి వెళ్ళకపోయిన యెడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనెదవు.” అంటిని.

అతడు మారు మాటాడక దత్తదిగంబర! దత్తదిగంబర! శ్రీపాదవల్లభ దత్తదిగంబర! అని పాడుకొనుచూ వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్టమీద పద్మాసనము వేసుకొని ధ్యానము చేసుకొనుచుండగా యీ దుష్టులబారిన పది మీ వలన రక్షింపబడితిని.


అంతట నేను, “అమ్మా, శ్రీపాదులవారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యాముగా ఉండని దేశముగాని, వారి ఎరుకలోలేని కాలము గాని యీ సృష్టిలో లేనేలేవు. కార్యకారణ సంబంధములతో యీ సృష్టిలో వివిధ దేశములలో, వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వ కారణములకునూ వారే మహాకారణము. రకరకాల స్థితులలో నున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణములేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదులవారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా యిటువంటి అన్ని స్థితులకూ అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియును. మనము శ్రీపాద శ్రీవల్లభులవారి నామస్మరణము చేసుకొనుచున్న యెడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తిని పొందగలము.” అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ, సుశీలయను పేరుగల యీ బ్రాహ్మణ యువతితోనూ కలసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మేమందరమునూ దత్త నామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందమువలె కనుపించుచుంటిమి. ప్రయాణమధ్యములో నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి.





శ్రీదత్తుడు ఛండాలవేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట





నామనందులవారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీనామానందుల వారిట్లు చెప్పసాగిరి. మానాయనగారి పేరు మాయణాచార్యులు. నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాసదీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తరదేశమునందలి పుణ్యక్షేత్రములను, సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చితిని. మేము శ్రీ వైష్ణవులమగుటచే శివారాధానము మాకు సమ్మతము కాదు. మడి, ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతీమాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చుచు ఛండాలునొకనిని చూచితిని. ఛండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి ‘నామానందా! నాకు గురుదక్షిణ సమర్పించి యిచ్చటనుండి కదులుము’ అని గద్దించి పలికెను. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు యీ వింతను చూచుచుండిరి. ఛండాలుడు శ్రీవైష్ణవబ్రాహ్మణోత్తముని గురుదక్షిణనిమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమీ అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగివచ్చి యీ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరి కొందరనుకొనిరి. అంతట నేను, “ఓయీ! నీవేవ్వరవో నాకు తెలియదు, అయిననూ నేను వైష్ణవబ్రాహ్మణుడను, నీవు ఛండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమియునూ సబబుగాలేదు.” అనంటిని. యింతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేక పోయితిని. వాని కన్నులు  చింతనిప్పుల వలె ఎర్రగానుండెను. వాని ముఖకవళికలు ఎంతటివారికయిననూ హడలు పుట్టించునవిగా నుండెను. నా యీ శాంతవచనములకు వాడు ఎంతమాత్రమును లొంగక, “నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచూ, నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రములవారిని ప్రశ్నించుచూ పిచ్చికుక్కవలె తిరుగుచున్నావు. బ్రాహ్మణజన్మనెత్తితినని దురహంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనెడి సన్యాసనామము నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయూ నాకు గురుదక్షిణగా నిచ్చి అందరునూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయిన యీ కత్తితో నీ శరీరమును ఖండఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదేపదే కుళ్ళపొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడిచేసెదను. ఖండించబడిన ప్రతీ శరీరభాగమునందునూ చైతన్యమును అనుభవించుచూ ఘోరమైన నరకబాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న ఔను, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటిదేవతలతో ఎవరినీ ప్రార్థించిననూ నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్కదేవత కూడా సాహసింపలేడు.” అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన ఛండాలుడు తన ఒరలో నున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను.


నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ ఛండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించితిని. నా వద్దనున్న రొఖ్ఖమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నియునూ నాకు కల్పితములుగా తోచెను. అయితే, నా ఊహలను అన్నింటినీ తలక్రిందులుచేయుచూ వారి మోహనమైన దివ్యమంగళరూపము నాకు దృగ్గోచర మాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్యమంగళమూర్తి, “నేను శ్రీదత్తుడను, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించితిని. నీవు నా వాడవు. నేను నీ వాడవు. నేను నీ సొత్తు. నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటినుండి నామానందుడవై ధర్మప్రచారము చేయుచూ, చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు.” అని దీవించెను.

నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట

అయ్యా! ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించివేయుచున్నది. ఏ యింటికి పోయిననూ నాకు అన్నమిడువారే కానరారైరి. జనులు నా గురించి వింతవింతగా “ఇతడొక పిచ్చివాడు. ఛండాలుడొకడు త్రాగివచ్చిన మైకములో వీనినుండి గురుదక్షిణ వసూలుచేసెను. ఇతడు బ్రాహ్మణుడయిననూ ఛండాలుని  గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన యితనికి  భిక్షవేయుట ధర్మశాస్త్ర విరుద్ధము.”అని చెప్పుకొనసాగిరి. యీ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగనే శ్రీ అప్పలరాజుశర్మ గారింటికి చేరితిని. భవతీ! భిక్షాందేహి! అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతోనుంటిని. ఇంతలో తలుపు తెరచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపుపళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగుమీద కూర్చొండబెట్టుకొని తమ దివ్యహస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను, మూతిని తుడిచిరి. అనంత శక్తిస్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచి, “నీకు సర్వమునూ సిద్ధము చేయబడును. దేనికోసమూ వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీవెచ్చటనున్ననూ నీ వెన్నంటియే నేనుందును. అదృశ్యముగా జంటనై సంచరించెదను. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుచుందును.” అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటినుండి నేను సన్యాసినై నా యిచ్చవచ్చినచోటుల సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది.

నాల్గు విధములైన జీవన్ముక్తులు

నేను, “అయ్యా! శ్రీదత్తులవారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానమున్నదా? ప్రత్యేకమయిన మంత్రములను ఏమయిననూ జపము చేయవలెనా? నా సంశయములను దీర్చి కృతార్థుని చేయవలసినది.” అని అడిగితిని



.
దానికి ప్రసన్నవదనులయిన శ్రీనామానందులు “నాయనలారా! మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షము కలుగవలెనను నియమములేదు. శారీరక ప్రారబ్దమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటివారిని ‘జీవన్ముక్తులు’ అని పిలువవచ్చును. తన యిష్టదైవము యొక్క లోకమునందు నివసించుట ‘సాలోక్యముక్తి’. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన యిష్టదైవము యొక్క సామీప్యమునందు నివసించుభాగ్యము కలుగును. దానినే ‘సామీప్య ముక్తి’ యందురు. అంతకంటెనూ విశేషమైన పుణ్యరాశియున్న యెడల తన యిష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే ‘సారూప్యముక్తి’ యందురు. అంతకంటెనూ విశేషమైనస్థితిలో తన యిష్టదేవతా చైతన్యములో ‘సాయుజ్యము’ నందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకొన్న దత్తభక్తులు యిహలోకమునందుండగనే సాలోక్యముక్తి ననుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్దము ననుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదారవిందములందు లగ్నమై సృష్టియొక్క ధర్మములను, ధర్మసూక్ష్మములను సృష్టి నిర్వహింపబడు చిత్రవిచిత్ర విధానములను తన అంతరదృష్టితో అవలోకించుచూ ఆనందము ననుభవించెను. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నియునూ, వారి ప్రమేయము లేకుండగనే విశ్వకళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోకజీవనము సాగించుచూ సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతరదృష్టితో సాలోక్యభక్తులకంటే విశ్లేషణాత్మకముగ తెలుసుకొందురు. వారు పొందెడి ఆనందము మరింత మిక్కుటముగానుండును. జీవిశరీరబద్ధుడైనపుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో, బద్ధావస్థయందుండును. పరిణామము చెందు కొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించునపుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుజ్యమునందిన శ్రీ దత్తభక్తుల  నుండి శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్చగా ప్రకటిత మగుచుండును. శ్రీదత్తులవారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుజ్యము నొందిన యోగిపుంగవులకు సంకల్పమనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారినుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరునూ శ్రీపాదుల వారి దివ్యాంశలే! ఆయా దేవతల ద్వారా శ్రీపాదులవారే భక్తులను అనుగ్రహించెదరు.” అని సెలవిచ్చిరి.

దత్తారాధనము యొక్క విశిష్టత





అంతట నేను, “అయ్యా! అటులయినయెడల మనము వివిధరూపములలోనున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది.” అని వారిని కోరితిని. అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై “ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి. అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది. అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమైయున్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత   పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి  వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు. ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని  విష్ణువును ఆదేశింప వచ్చును. ఈ ప్రక్రియలో  తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును.



వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదులవారి అశ్రితుడొకడు  గుఱ్ఱమునెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరచినది. రక్తసిక్తుడైన ఆ భక్తునివైపు శ్రీపాదులవారు తమ అభాయహస్తమును చూపగా గాయములన్నియునూ క్షణములో మాయమయినవి. శ్రీపాదులవారి యందు నమ్మకము యిసుమంతయు లేని మరొకనికి అదేరోజున నూరువరహాలతో నిండిన పాత్రయొకటి లభించును. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదులవారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతట శ్రీపాదుల వారిట్లనిరి. “నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. కాని వీని ఆయుర్దాయమును మరొక 20  సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్యభక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. నూరు వరహాలు దొరికినవానికి యీ రోజు మహాదైశ్వర్యము కలుగవలసిన రోజు. కాని వాడికి భక్తీభావము యిసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుటవలన వాని మహాదైశ్వర్యయోగమును కేవలము నూరువరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తిగలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొన గలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతియయిన పరమేశ్వరుడు కూడా అటువంటివానికి దాసుడయి సంచరించును.” అను సద్విషయములను, సందేశములను తెలియపరచిరి.

శ్రీ నామానందుల వారు యీ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనంద భరితులమయితిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతట నామానందుల వారు “మీరు ఏకభుక్తము చేయుచూ మండల దీక్షను పాటించుడు. మిక్కుటమయిన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు. ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు. అంతట పాపము శమించును. పాపశమనమయినట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని, స్వప్నములో గాని పొందగలరు. మండలదీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున  పూర్వపు అలవాట్లకు బానిసలయిన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము.” అని తెలిపిరి.

అనఘాసమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము



సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్నచిత్తులయిన నామానందుల వారు, “ఆత్మ నిరంతరాయమయినది. మనస్సు ప్రతీ క్షణములోనూ అనేక కోట్లసార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమకాలమున వారిరువురిలో ఎవరయినాగాని, లేదా వారిద్దరుగాని తమ మానసికచైతన్యము జీవనిర్జీవస్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందినయెడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నముచేయు మహాదోషములవలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగానుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలననూ, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్ళను నానావిధములుగా హింసించుట వలననూ, నిర్ధాక్షిన్యముగా శిశు హత్యలను, స్త్రీ హత్యలను చేయుట వలననూ, నిస్సహాయస్థితిలో నుండు అనాధల యెడల పరమ కర్కశత్వమును చూపుట వలననూ నపుంసకత్వము కలుగుట కాని, నపుంసకునకు భార్యగా అగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు పదిమంది సంతానమును కనుటవరకు హక్కుగలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మవిరుద్ధము. పదిమంది సంతానమును కన్నా తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా! నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకునూ, నీవు అనుకూల దాంపత్యముతో సర్వసుఖములను పొందుటకు అనఘావ్రతము చేసి అనఘాదేవి సమేత శ్రీదత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి యిహలోక సుఖము, పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్తదర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతీ అక్షరమునందును యుగాయుగాంతముల వరకూ చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములయిన విధినిషేదములును లేవు. నేను యీ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటినుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రమును నా మదిలో మొదులుచున్నది. వినండి!

సిద్ధమంగళ స్తోత్రము

1 . శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

2 . శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

3 . మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

4 . సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

5 . సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

6 . దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

7 . పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

8 . సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

9 . పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా

     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

నాయనలారా! పరమపవిత్రమైన యీ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతముచేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండలదీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించినచోట  సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు.” అని అమృతవాక్కులను ఆ సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి వివరించిరి.

శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట

శ్రీనామానందుల వారి నోటివెంట యీ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతట నేనిట్లంటిని. “మహాపురుషా! ఈ దివ్యస్తోత్ర పారాయణముతో, శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కధాప్రసంగాములతో యీ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున యీ రాత్రి గడుపవలెననెడి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులయిన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించుకొనుచున్నవాడను.” నాతోబాటు ఉన్న సుశీలయును, బ్రాహ్మణ సోదరులును, నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులయిన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయునూ, శ్రీపాదులవారి నామస్మరణముతోను, వారి లీలాకథా ప్రసంగములతోను, సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషఃకాలమున శ్రీపాదులవారికి దివ్య శ్రీమహామంగళహారతి యీయబడెను.

మహామంగళ హారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్లబండిపై భోజనసామాగ్రిని వేసికొని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలును, నీ భర్తయు వేరొక బండిలో యీ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజనసామగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీ నామనందుల వారు ధ్యానావస్థలో నుండిరి.





శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులయినపుడు బండివాడెక్కడ? అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయెనని చెప్పగా, ఆహా! మీరెంత అదృష్టవంతులు! నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమునూ విస్తుపోతిమి. శ్రీ నామానందులు “శ్రీపాదులవారు పరమ కారుణ్యమూర్తి! వారే బండివాని రూపములోవచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా! సుశీలా! నీ అదృష్టము పండినది. నీ భార్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయునూ, అత్తమామలునూ కొలదిసేపటిలో ఎడ్లబండిలో యిచ్చటకు చేరుకొనుచున్నారు.” అని పలికిరి.

త్రికాలవేదులయిన నామానందులవారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో, అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

Related posts

Share this