అధ్యాయము 16
శ్రీమన్నారాయణ వృత్తాంతము
నేను శ్రీపాదులవారి దివ్య చరితమును మననము చేసికొనుచూ, మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసికొనుచూ పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననెడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడయి ఉన్నాడు. అతడు “అయ్యా! కొంతసేపు యిక్కడ విశ్రమించి చెరుకురసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు.” అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు యిచ్చిన చెరుకురసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను.
“అయ్యా! నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే! అయితే వారు బ్రాహ్మణులు. మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును, మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్ధికపరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పులబాధకు తట్టుకొనలేక చార, స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములనోసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము “దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలనమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన యెడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది.” అని బాపనార్యులను ప్రార్థించితిమి.
ఆ రోజున బాపనార్యుల యింట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు, “బాపనార్యుల యింట లభించేది అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురయిన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభామయిన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది.” అని పలికిరి. శ్రీ బాపనార్యులు “మా భూములను యిదివరకే పంటకాపులకు ఒసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమయిన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకక పోదు.” అనిరి. తదుపరి శ్రీపాదులవారు, “ఇదిగో! గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి యీ మినుములను పారవేయవలసినది. రాతిక్రింద కప్పకు కూడ ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది.” అనిరి.
మేము బాపనార్యుల యింట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధదంపతులు మాత్రముండిరి. వారుకూడ కమ్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుతచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడ కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడ లేదు. ఆ విధముగ ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననెడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్ఠులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికీ తమ ఆస్తిపాస్తులను యీయవలెననెడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధదంపతుల యింట మాకు ఆతిధ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలించిననూ ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా యింటిల్లిపాదికీ, వాంతులు, విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినపుడు వృద్ధదంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్యభావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ యింట తిష్ఠవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశక్యత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో, రేవో యిచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి.
దాయాదులకు వృద్ధదంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని, వారు మాత్రము అక్కరలేదు. మేముకూడ వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకొనవలెననెడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలోవారు రాజీకివచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని, మమ్ములను ఆ యింటనుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి.
దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచిపడి అతనిని ఆ వృద్ధదంపతుల యింటికి తీసుకొనివచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. “మీ యింటనున్న యీ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ యింటనున్న ఆ యింట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ యింటి నుండి పంపించివేయుడు.”
దానికి వృద్ధ దంపతులు “మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నయెడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంతధానము ఖర్చు అయిననూ, వారికి ఉన్న అమంగళములన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరునూ మంత్రాధీనులయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సద్బ్రాహ్మణులయిన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది. ” అని ఆ జ్యోతిష్కుని కోరిరి.
జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా! శంకరభట్టూ! ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మలకునూ వేదమే మూలమయి ఉన్నది. యాగములచేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకునూ, దేవతలకునూ పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు అయిదు రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్యసహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమయిన దోషములు లేవు. వృద్ధదంపతుల పుణ్యమా అని మాకు పరమపవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్పహవిస్సులు, మంత్రసామర్థ్యము వలన ఏయేదేవతలకు ఎంతకావలయునో అంతవృద్ధిని పొందును.
భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది
గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల యిహలోకస్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోకస్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది.
పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పదిమందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు.
శ్రీ బాపనార్యులవంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడయిన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి.
శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము
యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాడులకు యీ ఘటనాక్రమమంతయునూ అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు నాలుగువైపులా సరిహద్దులందు తాటిచెట్లు ఉండెను. ఆ తాటిచెట్లను కల్లుగీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు యీయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరపపండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరపపండ్లు కోయబడెను. అవి అన్నియునూ బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకొనిపోవుటకు సిద్ధముగానుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యము చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు పదుగురు. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లూకమును గాంచితిని. ఆ భల్లూకము చెట్టునుండి క్రిందపడినది. భాల్లూకమనిన అందరకునూ భయమే! వాడియైన తన గోళ్ళతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్ఛరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాడులవారి నామమును ఉచ్ఛరించినపుడు తన చేతులతో తాళమువేయుచూ ప్రసన్నముగానుండెను. నేను మిరపపండ్ల బస్తాలతో రెండెడ్లబండిలో యింటికి చేరితిని. నా బండికి ముందుభాగమున భాల్లోకము నడుచుచుండెను.
మా యింటిలోని వృద్ధదంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండువారందరికి యిది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్ఛరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భాల్లోకము కూడా ఆనందముగా స్వీకరించినది.
ఆ రోజునుండి భల్లూకము మా యింటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబసభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా యింట ప్రతి నిత్యమును దత్తప్రభువుల లీలావిశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను.
శ్రీమన్నారాయణ యీ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాల స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగనే అది ఆనందముతో గంతులు వేయసాగినది.
శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను
మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారినుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాన్త్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా యింటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకమునందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొనియుండెను. తాంత్రికుడు ఒకానొక యోగప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగప్రక్రియద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను.
శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధకర్మల నుండి రక్షించుట
శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను.
శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రికబాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవులయొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మఫలముల తీవ్రతను క్షీనింపచేయుదురు.
శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యధావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగానుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదులవారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి.
నామపారాయణము జరుగుచున్నపుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవమువలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటిని అది పొందసాగెను. భక్తులు నామ పారాయణము చేయునపుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్త్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్త్వము నశించి మానవత్త్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూకతత్త్వములోనికి మార్పుచెందుటచే తాంత్రికుడు భల్లూకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్ళతో బంధించి అడవిలో దించివైచిరి.
భల్లూకము మానుషభాషలో మాట్లాడనారంభించి, “అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను. ఎక్కువ వడ్డీలను వసూలుచేయుచూ జనులను మిగుల బాధించితిని. తత్ఫలితముగా భల్లూకజన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమజన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికితోడు శ్రీపాదుల వారి భక్తుడను, మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు, శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చలభక్తితో వారినారాధించువారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను.” అని పలికెను.
అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చటనుండియో మూడు నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునపుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన మూడు నాగుపాములు భల్లూకమునకు మూడుసార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చటనుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయునూ మా యింటనే ఉండినవి.
మాకు సర్వకాల సర్వావస్థలందునూ శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయినవారు గాని, మైలదోషము సోకినవారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి.
నాగుపాములు మాయింట నివసించుటచే మా యింటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్తభక్తులు మా యింటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని, శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయభావముతో నుండెడివి. వృద్ధదంపతులు యింటి భాగములోని కొంతస్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించియుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్దారించిరి. తీర్పు వెలువడునంతవరకునూ ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుటకు అనుమతి యీయబడెను. మా దాయాదులు గ్రామపెద్దలను ధనప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైననూ తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట యుండెను. నాగులచవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమియునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు “నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము! మా అభీష్టములు తీర్చుము” అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకూ దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును.
శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగులచవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్న వారు ప్రార్థనచేయు వారు, పాలుపోయు వారు యీ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి.
నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము యిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును, మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే మూడు నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు.
తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠమునాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.
పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.
ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.
మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము.
కాతికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడుబాధను చూడలేక నీళ్ళు తెచ్చిపోసెను. అయిననూ అది అగ్నిని ఆర్పలేదు సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్ననూ అతని శరీరము ఏ మాత్రమూ కాలలేదు. అవయవములేవియునూ విక్రుతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను.
నాయనా! శంకరభట్టూ! రౌరవాది మహానరకములందు అనేక అర్బుధముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునపుడు శిఖపిండుకొనునపుడు, గావంచాను పిండుకొనునపుడును, భోజనసమయమునందు ‘రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతు’ అని పరిషేచనము చేసి విడుచు నీరు అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగా నున్నవారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులయిన వారికి శ్రీపాదుల వారు కొంగుబంగారము, ధర్మభ్రష్ఠులు, మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు.
మాంత్రికుని శవము చితినుండి గంతులువైచుచూ గ్రామపెద్ద యింటికిచేరెను. అగ్నిచేత దహించబడకుండగా, అగ్నివలన మహావేదనను అనుభవించుచూ పెడబొబ్బలు పెట్టుచూ, అతడు గ్రామపెద్ద యింటికిచేరెను. మేమందరమునూ గ్రామపెద్ద యింటివద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచూ, దత్తప్రభువు యొక్క దివ్య, భవ్య, నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్తదిగంబరా! శ్రీపాదవల్లభ దిగంబరా! అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూలరూపమున నున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము నందలి దివ్యకిరణములు వారి స్థూలసన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతనూ పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటానుకోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండెను. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య, సామీప్య, సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలయిన వారిని పవిత్రము చేయుచుండును.
వారి దివ్య నామస్మరణము చేయునపుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల ద్వారా తమ ఉనికిని, సత్తాను ఋజువుచేయుచుందురు.
దత్తుడు దిగంబరుడా ? శ్రీపాదుడు దత్తుడా! అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా? అని మాంత్రికుడు శ్రీపాదులవారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటినుంచి మాంత్రికుని తీసుకొనివచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా, దిగంబరావస్థ లో తన భక్తులయెదుట నిలబెట్టినారనిన యిది సామాన్య విషయమా? సామాన్య యోగులకు యిది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను, ఎప్పుడయినా విన్నామా? కన్నామా? అంతయునూ చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులయిన వారు, తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్ల వాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను, సౌఖ్యములను పొందెదరు.
శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచూ ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపినయెడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యముచేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయునూ స్వయంకృతాపరాధమనియూ, ఆ అపరాధము యొక్క కర్మఫలమును యీ విధముగా అనుభవించుచున్నాననియూ అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతిచేసిన విషయములను అతడు గుర్తుచేసుకొనెను. తన అజ్ఞానకాలమున మహాత్ములను, దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మానస్ఫూర్తిగా శరణుజొచ్చెను.
అతని మనస్సులో యీ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుట కిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవకుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్దకుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహ లోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచూ సాధువర్తనుడనై జీవించెదనని ఎటో పోయెను. గ్రామపెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పుచెప్పెను.
మూడు సర్పరాజములు నివసించిన పుట్టయందు మూడు ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా యింటికి అరుదెంచెను. అతడు యీ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయము నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా యిచ్చి భుజింప మనెను. అతడిట్లు వచించెను. “శ్రీపాదులవారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వ్రుక్షమూలమున కూర్చొనెడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వ్రుక్షమూలమున నున్న శ్రీపాదులవారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ, నృశింహసరస్వతి, స్వామిసమర్థ అను నామత్రయమునకు సంకేతమే యీ మూడు వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ మూడు వృక్షములు. కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఔదుంబర వృక్షబీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలము నందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున నున్న శ్రీపాదులవారికి శనిప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడువారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమై యుండును.” ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు ధృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
