October 18, 2024
SGSTV NEWS
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam…రెండవ అధ్యాయము

శ్రీ గణేశపురాణం – రెండవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము
సోమకాంత వర్ణనం
సూతమహర్షి ఇలా కొనసాగించాడు: –

ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా ఆతడికి పూర్వజన్మకర్మ పరిపాకంవల్ల అతిదారుణమైన కుష్టువ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మ లేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందే నన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి, సోమకాంత మహారాజు. ఆవ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు!

కాని,నానాటికీ అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసి ఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఎముకలగూడు వంటి శరీరంమాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆరాజు మంత్రులను ఒకనాడు తనవద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు.

ఓ అమాత్యులారా!నా శరీరారోగ్యం నానాటికీ క్షీణిస్తున్నది! ఈజన్మలో నాకు తెలిసినంత వరకూ అన్నీ సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనులసేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్యపరిపాలననూ ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను! బహుశ ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలచు కోలేదు.

నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి!మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను.

సర్వసంపదలనూ పరిత్యజించి జీవితపరమార్ధాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను.

ఈ వాక్యం పూర్తిచేసి శరీరబాధ అధికం కాగా సొమ్మసిల్లి పోయాడు సోమకాంతుడు. అప్పుడు శైత్యోపచారములతోనూ, మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి, మంత్రులు ఆరాజుతో యిలా అన్నారు.“ఓ మహారాజా! నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగ భాగ్యాలను వైభవాలనూ నీవల్ల, అనుభవించాము. ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీరబాధను అనుభవిస్తూంటే కృతఘ్నుల్లా మేము మా పదవులకు అంటి పెట్టుకోవాలను కోవటంలేదు.

మీ అభీష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి, మీతో అరణ్యాలకు అనుసరించివస్తాము! అందుకు అనుమతించండి!” అంటూ వేడుకున్నారు. అప్పుడు ఆరాజు భార్యయైన రాణీ సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది.”ఓ మంత్రి పుంగవులారా! నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించినా భర్తతో కూడా అడవికెళతాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి! అదే మీకూ, నాకూ – ఉభయ తారకము”అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా,తండ్రీ! మీ సేవకన్నా నేను ఇంక కోరుకునేదేమీలేదు!

ఈ రాజ్యము, ధనమూ వీటివల్ల నాకేమీ ప్రయోజనంలేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీసేవలో తరిస్తాను” అన్నాడు.

అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుని చేరబిలిచి”నాయనా! కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం, శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాదికములు చేయటమూ, గయలో పిండప్రదానము చేయడమూ ప్రధానకర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!

కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు!ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం! నేను ఒక్కడినే భార్యాసహితుడనై అరణ్యాలకువెళ్ళ నిశ్చయించాను!

అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచనా మందిరంలోకి వెళ్ళి అతడికి నానావిధములైన ఆచార వ్యవహారములనూ రాజనీతి రహస్యములనూ ఇలా ఉపదేశించసాగాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం సంపూర్ణం.

ఇది కూడ చదవండి శ్రీ గణేశ పురాణం.. Sri Ganesha Puranam

Related posts

Share via