మహాశివరాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైన పర్వదినం. ఈ రోజున భక్తులు శివుడికి అభిషేకాలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు. శివనామ స్మరణతో రోజంతా గడుపుతారు. మహాశివరాత్రి కేవలం పండుగే కాదు.. ధ్యానానికి కూడా మంచి సమయం. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రాలు, పురాతన విజ్ఞానం చెబుతున్నాయి.
ఉపవాసం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసును శుద్ధి చేయడానికి చక్కని ఉపాయం. శివరాత్రి వంటి పర్వదినాల్లో ఉపవాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
👉 చంద్రుని ప్రభావం.. మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. చంద్రుడు సముద్రంలో అలలను ప్రభావితం చేసినట్లే మన శరీరంలో జీర్ణక్రియ, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాడు. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
👉 మనసు, శరీరం స్థిరంగా ఉంటాయి.. ఉపవాసం, ధ్యానం, మంత్రోచ్ఛారణలు ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గిస్తాయి. మనసును, శరీరాన్ని స్థిరపరుస్తాయి.
👉 శరీరంలోని వ్యర్థాలు తొలగుతాయి.. ఉపవాసం వల్ల శరీరంలో పేరుకున్న వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
👉 జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి.. కొంత సమయం ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణాశయం ఉత్తేజితమవుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.
👉 మానసిక స్పష్టత.. ఖాళీ కడుపుతో ఉండటం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతాయి.
👉 ఇన్సులిన్ నియంత్రణ.. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. ఇది హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారికి చాలా మంచిది.
ఆధ్యాత్మికంగా ఉపవాసం
ఉపవాసం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. అంతర్గత శాంతి, జ్ఞానోదయాలు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. అందుకే మన ఋషులు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చేసే చికిత్సగా గుర్తించారు. మన శక్తి, స్థాయిని బట్టి ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఉపవాసం చేయాలి.
ఉపవాస రకాలు
👉 నిర్జల ఉపవాసం.. 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోకూడదు. ఆరోగ్యం సహకరిస్తేనే ఈ ఉపవాసం చేయాలి.
👉 జల ఉపవాసం.. రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి.
👉 ద్రవ ఉపవాసం.. ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి.
👉 పాలు, పండ్ల ఉపవాసం.. పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.
👉 సాత్వికాహార ఉపవాసం.. ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన బంగాళాదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.
ఉపవాస నియమాలు
👉 శక్తి తగ్గకుండా ఉండాలంటే శారీరక శ్రమను తగ్గించండి.
👉 ధ్యానం, మంత్రోచ్ఛారణ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంలో సమయం గడపండి.
👉 హైపర్ టెన్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసం చేయవద్దు. రక్తపోటు ఉన్నవారు పండ్లు, పాలు తీసుకునే ఉపవాసాన్ని ఎంచుకోవడం మంచిది.
ఆధ్యాత్మిక సూచనలు
👉 మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ధ్యానం చేయండి.
👉 ఆధ్యాత్మిక శుద్ధి కోసం శివునికి బిల్వ పత్రాలు, నీరు, పాలు సమర్పించండి.
👉 రాత్రి జాగరణ చేసి మెలకువగా ఉండండి. ఇది ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుతుంది.
ఉపవాసానికి ముందు
ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా ఉండాలంటే ఉపవాసానికి ముందు రోజు రాత్రి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. అంటే నెయ్యి, గింజలు, పనీర్, పెరుగు, కొబ్బరి, పండ్లు వంటివి తీసుకోవాలి.
ఉపవాస విరమణ
ఉపవాసం తర్వాత మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి
