July 8, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

Srisailam: శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం! వీడియో

జాతుల, భాషల చరిత్రకి నమ్మకమైన భౌతిక ఆక్షరాల్లో శాసనాలు ముఖ్యమైనవి. శిలా శాసనాల్లో కనిపించే విషయాలను మనవాళ్లు ప్రామాణిక సత్యాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో 14వ శతాబ్దం నాటి శిలాశాసనం, అతి పురాతన శివలింగం బయటపడ్డాయి. దీంతో శివ భక్తులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాంఫి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా, శివలింగం బయటపడింది. పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం వెలుగులోకి వచ్చింది. శివలింగంతోపాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

యాంఫి థియేటర్ నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ పనులు చేస్తుండగా శివలింగం కంట పడటంతో దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు దేవస్థానం అధికారులు పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు.

శిలాశాసనం పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. చక్ర గుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్టించినట్లు లిపిలో నమోదు చేసి ఉంది. ఈ మేరకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడటం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

Related posts

Share via