ఎన్ని చారిత్రక ఘట్టాలకు నెలవు మన దేశం. శ్రీరాముడు నడయాడిన ఈ నేలపై ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఓ ఆలయమే కూడవెళ్లి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కూడవెల్లిలో ప్రతీ ఏటా మాఘ మాసంలో అత్యంత అట్టహాసంగా జాతరను నిర్వహిస్తారు. స్వయాన శ్రీరాముడు ప్రతిష్టించిన శివలంగం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పొచ్చు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం..

సిద్ధిపేట జిల్లా, భూంపల్లి మండలం, దుబ్బాకకు దగ్గరలో రామేశ్వరం పల్లి గ్రామంలో ఉందీ శైవక్షేత్రం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ప్రతీ ఏటా మాఘ మాసంలో ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. కూడవెళ్లి జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణలోని జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నాలుగు రోజుల పాటు జరగే ఈ జాతరకు వేలాది మంది తరలివస్తుంటారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీ నుంచి జాతర ప్రారంభమైంది.

రెండు వాగులు కలయిక ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. ‘కూడవెల్లి చూడని బ్రతుకు కుక్క బ్రతుకు ‘ అనే నానుడి ఇక్కడి ప్రజల్లో ఉంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రజలు ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. సహజంగా వాగులు పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తాయి. అయితే కూడవెళ్లి వాగులో మాత్రం తూర్పు నుంచి పడమరకు వాగు ప్రవహిస్తుంది. ఇది కూడా ఇక్కడి ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక్కడ పార్వతి సంగమేశ్వర ఆలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, వినాయకుని ఆలయాలు కూడా ఉంటాయి.
చారిత్రక నేపథ్యం..
శ్రీరామ చంద్రుడు రావణాసురుని వధానంతరం తిరిగి అయోధ్య వెళ్తుంటారు. ఈ సమయంలోనే రావనణ వధ కారణంగా తలెత్తిన బ్రహ్మహత్య మహాపాపం అని ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ కూడవెల్లి వాగు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించాలని అగస్త్య మహాముని శ్రీరాముడికి సూచిస్తారు. ఇందులో భాగంగానే హనుమంతుడిని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు ఆజ్ఞాపిస్తాడు. అయితే ముహుర్త సమయం మించిపోతుండడం, ఆంజనేయుడు ఎంతకీ రాకపోవడంతో శ్రీరాముడే స్వయంగా వాగులోని ఇసుకతో ఒడ్డున సైకత లింగాన్ని ప్రతిష్టిస్తాడు.
అయితే అంతలోనే హనుమంతుడు మరో లింగాన్ని తీసుకొస్తాడు. అప్పటికే శ్రీరాముడు ప్రతిష్టించిన లింగాన్ని చూసిన హనుమంతుడు.. నేను తెచ్చిన లింగం ఎలా అని అడగ్గా.. ‘బాధపడకు హనుమ, మొదట నీవు తెచ్చిన లింగానికి పూజలు చేసినాక, నేను ప్రతిష్టించిన సైకత లింగాన్ని పూజిస్తారు’ అని చెప్పారంటా. దీంతో ఈ ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి. ఇసుక లింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. కొన్ని రోజుల క్రితం వరకు సైకత లింగానికి అభిషేకం చేసే వారు, అయితే ప్యాక్జేడ్ పాలతో అభిషేకం చేయడం వల్ల లింగం కరుగుతున్న విషయాన్ని గమనించిన ఆలయ అర్చకులు వెండితో ఒక కప్పును రూపొందించారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టే ఈ ఆలయానికి భక్తులు ఇంత ఎత్తున తరలి వస్తుంటారు.
ఎలా చేరుకోవాలి.?
సిద్ధిపేట, మెదక్ రహదారిలో భూంపల్లి చౌరస్తా నుంచి కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ – నిజమాబాద్ హైవేపై వెళ్తుండగా రామాయంపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి భక్తులు చాలా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సిద్ధిపేట లేదా రామాయంపేట మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. జాతర సమయంలో సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంటుంది.
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!
- ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదివితే.. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి..!a
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా