SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam Telugu
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -5

అధ్యాయము-5



శంకరభట్టు తిరుపతి చేరుట, కానిపాకమున తిరుమలదాసును సందర్శించుట

శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణనేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రమునకు వచ్చితిని. నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రములోని పుష్కరిణిలో స్నానము చేసి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వేంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాలాత్రిపురసుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరి కొద్ది సేపటికి మహావిష్ణు రూపముగా మారినది. ధ్యానము మరికొంతసేపయిన తరువాత ఆ మూర్తి పదునారు వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృతదృష్టియని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడొకడు అరుదెంచెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో “శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! మీరు జగన్నియింతలు. మీ భక్తుడైన శంకరభట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల యిక్కట్లున్నవో అన్నింటిని వానిచే అనుభవింపజేసెదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచియున్నాను.” అని పలికెను.



కరుణాంతరంగుడైన ప్రభువు, “ఓయీ శనైశ్చ్వరా! నీవు కర్మకారకుడవు. జీవులను కర్మఫలితములను అనుభవింపజేయుచూ వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత  భక్తజనరక్షణ నా ప్రతిజ్ఞ కనుక, నీవు శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధముగా ఆదుకొనిఎట్లు విడుదలచేసెదనో నీవే చూతువు గాక!” అనెను. శ్రీపాదులు, శనైశ్చ్వరులు యీ రకముగా సంభాషించుకొనిన తదుపరి యిద్దరునూ నా ధ్యానమునుండి తొలగిపోయిరి. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయెను. నాకు కష్టకాలము సంప్రాప్తమయినదనియూ, శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిజేర్చుదురనియూ తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చితిని.




తిరుపతి వీధులలో యిచ్చవచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలముగా ఉన్నది. ఒక క్షురకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి, “నీవు 20 సంవత్సరముల క్రితము యింటినుంచి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా! నీ తల్లిదండ్రులు బెంగపడియున్నారు. నీ భార్య రజస్వరాలైనది. ఆమె యీడేరినది. కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడెను.” అంతట నేను “అయ్యా! నేను శంకరభట్టు అను కన్నడదేశ బ్రాహ్మణుడను. బాటసారిని. పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీదత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు. నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకొనునట్లు మంగలి సుబ్బయ్యను కానే కాను.” అని పలికితిని.



కాని అతడు నా మాట వినువాడు కాడయ్యేను. అచ్చట చాలా మంది జనులు పోగుపడిరి. అందరునూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనువాని యింటికి తోడ్కొనిపోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచూ తమను విడిచి పోరాదనియు, రజస్వల అయిన భార్యను విడచిపోవుట మహాపరాధమనియు, ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, “సుబ్బయ్య గెడ్డము, మీసములతో పీడగొట్టుకొని పోయినాడు. వీనికి క్షురకర్మ చేసిన యెడల పూర్వపు కల వచ్చునని” సెలవిచ్చెను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వారు వినరయ్యిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండు గీసిరి. గెడ్డము, మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసము వారికి తెలిసిన భూతవైద్యునొకని రావించిరి. అతడు చిత్రవిచిత్రమైన వేషధారణ చేసి యుండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివైచి కత్తితో నా గుండున గాయమునేర్పరచిరి. దానిపై నిమ్మకాయ రసము, మరి యింకనూ వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తరువాత సుబ్బయ్యను బ్రాహ్మణదయ్యము పట్టెననియూ, అందుచేత యితడు జందెము ధరించి మంత్రములను వల్లించుచుండెననియూ తేల్చిరి. తిరుపతిలో నున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియూ అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉన్దేననియూ తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొనిపోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీకుడనని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకొందునని తెలిపితిని. ఆ బ్రాహ్మణపెద్దలు నేను చెప్పునది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకొనెననియూ అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసినదని” వారికి చెప్పిరి.



గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లి పోయితిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహ లోనికి వచ్చునప్పటికి నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొనియుండుటను నేను గ్రహించితిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను. నాతో తదాకారమయిపోయెను. ఏలినాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యెననియూ 7 1/2 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియూ నా మనస్సునకు తోచెను.

శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీ చరణుల నామస్మరణము చేయుకొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రము కోళ్ళను, మేకలను బలి సమర్పించి, చిత్రవిచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యము తో కూడిన ఆహారము యీయబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యము పట్టినది గనుక శాకాహారము యీయవలసినదని మాంత్రికుడు తీర్మానించెను. నాచేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమోయని ఎంతయో కలత చెందితిని, కాని శ్రీపాదుల వారి అనుగ్రహము వలన నాకు శాకాహారము యియ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. మూడు రోజులు నేను తీవ్రమయిన నరకబాధను అనుభవించితిని. అంతటి నరకబాధలోనూ నేను శ్రీ చరణుల స్మరణ మానకపోవుట వలన నాలుగవరోజు నుండి బాధ అనుభావములోనికి వచ్చుట మానివేసెను. శరీరముపై చిత్రవిచిత్రమైన ప్రయోగములు చేయబడుచుండెను.



మాంత్రికుడు కొరడా తో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభా! శరణు! శరణు! అని బాధతో విలవిలలాడిపోయితిని. శ్రీదత్త ప్రభువును అనన్య భక్తితో సేవించువారికి నరకబాధలెట్లుండును. అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను, నాకు యిసుమంతయైనాను బాధ కలుగలేదు. అయితే మాంత్రికుడు మాత్రము విలవిలలాడి పోయెను. అతడు నన్ను కొట్టినపుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతము కాకుండెను. అతడు నా వైపు వెర్రి చూపులు చూచుచుండెను. నేను శ్రీ చరణుల దివ్యలీలను గమనించి నవ్వుకొంటిని. నేను పథ్యాహారము తినుచుండిననూ అది నాకు చాల మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు, మేకలు భుజించుచున్ననూ అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోజ్గ్యము క్షీనించు చుండెను. అంతట అతడు నన్ను బాధించుట మాని కేవలము మంత్రములు, పూజలు మొదలయిన వానితో కాలక్షేపము చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన అయిదవరోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ యింటిలో నిప్పు రాజేయకపోయిననూ, ఇంట్లో అందరునూ చూచుచుండగనే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యెను.



ఆరవరోజున అతడు బిక్కమొహముతో సుబ్బయ్య యింటికి వచ్చి, సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణదెయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయుటవలన ఆ బ్రాహ్మణ దెయ్యము తన యింటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించెననియూ, భేతాళుడు మొదలయిన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలెననియు, దానికి విశేషమైన ధనము కావలెననియూ సూచించెను. వైద్యము చేయుటవలన ఫలితము ఏమీ లేదనియూ, మాంత్రికుడు ధనాశతో యీ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియును. అందుచేత విధివిధానమునకు తల ఒగ్గి, సుబ్బయ్య భార్యను నా భార్యగా స్వీకరించవలసి వచ్చిన యెడల అంతకంటె దురదృష్టము, నమ్మకద్రోహము మరియొకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితముతో యింత క్రూరముగా ఎందుకు ఆడుకోనుచున్నదో తెలియక నా గుండెలో రంపపుకోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో యిట్లంటిని. “జననీ జనకులారా! మీరు ఉన్న చర స్థిరాస్తులన్నింటినీ విక్రయించి యీ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నానని” పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపదిరి. వారి కండ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృసమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతుని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రిపాడులను ప్రార్థించుకొంటిని.


నాకు వైద్యము ప్రారంభమైన ఏడవదినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి యిట్లంటిని. “నా గురించి నీవేమనుకొనుచున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా?” అందులకు ఆమె “నాకు రెండు సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనునది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూచినా మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండజాలడు. మీరు యిన్ని బాధలు పడుచున్ననూ నన్ను భార్యగా భావించలేదు, కనీసము తాకనయినా లేదు.ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమయిన అభిప్రాయమునూ లేదు. కులాచారము ననుసరించి ధర్మముగా జీవించ దలచితిని. మీరు నా భార్తయీ అయినచో యీ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున, నా భర్త పలాయనమాయి 20 సంవత్సరములు అయిన కారణముననూ, అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతనూ, నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడచుకొందును. మీరు సదా స్మరణము చేసుకోను శ్రీపాదవల్లభులు ఎవ్వరు? వారు సద్గురువులయిన యెడల యీ విషమ సమస్యకు ధర్మ సమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించెదను.” అనెను.

ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచెను. అంతట నేను యిట్లంటిని. “శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయులవారు. ఈ కలియుగములో అవతరించినవారు. ప్రస్తుతము కురువపురము నందున్నారు. మన భావముననుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని ఋజువుచేయుదురు. మంచిది. నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యము బోధపడగలదు. అందరికీ ఆమోద యోగ్యమయిన పరిష్కారము లభించగలదు.”

శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడా నివారణ

ఆ రోజుననే మాలజంగమొకడు అచ్చటకు వచ్చెను. జంగమదేవర వేషమున నున్న అతని వద్ద తాళపత్ర గ్రంధములుండెను. ఆ వాడలోని జనులన్దరకూ అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యెను. తనను కలసిన వారందరికినీ అతడు భూత భవిష్య ద్వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్ద నున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంతములనియూ, దానిని రమలశాస్త్రమని అందురనియూ దానిలోని విషయములు తూ.చ. తప్పకుండా జరగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్దన మేరకు అతడు వారి యింటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనేను. ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంధముల నుండి ఒక పత్రమును తీసి యిట్లు చదివెను. “ప్రశ్న వేసినవాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను యితడు లిఖించును. పూర్వజన్మమున యితడును, మరియొకడును కందుకూరు అను పట్టణమునకు ఆనతి దూరమునందున్న మొగలిచెర్ల అను గ్రామము నందు జనిన్చిరి. ద్యూతక్రీద యందు విశేష అనురక్తులయిరి. ఆ గ్రామము నందు ప్రసిద్ధమైన స్వయంభూదత్త దేవాలయమున్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయములందు యతడు పూజాదికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగానమునండు తన మిత్రునితో కలిసి యితడు ద్యూతక్రీడలో నిమగ్నుడయి ఉండెడివాడు. ఇది ఎంతయో అపచారమయిన విషయము. తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమయిన నిబంధనలతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన యెడల యితడు ద్యూతము నందు ఒడ్డిన ధనమీయవలెను. తాను జూదమునందు నెగ్గిన యెడల తన మిత్రుని భార్యను యితనికి ధారాదత్తము చేయవలయును. దీనికి సాక్షిగా యీ దత్తప్రభువే! అని ప్రమాణములు చేసికొని జూదమాడిరి.



తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జూదమునందు శంకరభట్టు విజయమొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను యితనికి ధారాదత్తము చేయుటకు నిరాకరించెను. తగవు పెద్దమనుష్యుల వరకు వెళ్ళెను. కులపెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో యింతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియూ, పరస్త్రీయందు మరులుగలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన యితనికి నెత్తిమీద వేడి వేడి నూనెను పోయవలెననియూ, జూదమున తన భార్యనొడ్డిన యితని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగఛ్చేదనము చేయవలెననియూ, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలెననియూ తీర్మానించి, వారి తీర్మానమును అమలుపరచిరి. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుటవలన యీ జన్మనందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రము నందు జన్మించి మనస్చాన్చాల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి యీ రామలశాస్త్రము వినిన మరుసటిరోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును.

శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7 1 /2 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను, అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కతినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంతభాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమె చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపురదేశము నందున్న అక్షయకుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును.

శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగానుండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జననీజనకుల నుండి శలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామమును చేరితిని.



కాణిపాకం గ్రామము చిత్తూరునకు ఆనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంటేశ్వరస్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములును కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసికొని బైటకు వచ్చితిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి యుండెను. నాకు భయమువేసి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి తిరిగి వేదలితిని. కొంతసేపు దైవధ్యానము చేసుకొని బైటకు వచ్చితిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిణామము గల మరియొక కుక్క యుండెను. ఈ రోజున యీ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చితిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి “అయ్యా! మీరు మాటిమాటికీ బయటకు పోవుచూ, లోనికి వచ్చుచున్నారు. కారణమేమిటి ?” అని అడిగెను. నేను నా భయమును గూర్చి చెప్పితిని. అంతట పూజారి, “అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్దనుండు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామదేయమున శ్రీ దత్తులవారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయిననూ, అతడు మాత్రమూ యీ ఆలయము లోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి యిచ్చెదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు రెండు కుక్కలను చూచితినని చెప్పితివి. మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును యిచ్చెదను. మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూచెదము.” అనెను. మేము బయటకు వచ్చునప్పటికి అచ్చట నాలుగు కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వాటికి యిచ్చెను. ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగువైపులా చుట్టుముట్టినవి. పూజారి “ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకునియొద్దకు పొమ్ము. నీకు శుభమగును.” అని పలికెను.



నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలిసికొంటిని. సుబ్బయ్య యింటివద్ద జరిగిన సంఘటనలననుసరించి మతభేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున ఛండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. బ్రాహ్మణుడు ఛండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటకట్టుకొని జన్మజన్మాంతరముల వరకు కర్మప్రవాహమున పడిపోవుచుండునని తెలిసికొంటిని.

శంకరభట్టుకు తిరుమలదాసుకు జరిగిన సంవాదము

పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించు చోటుకు వెళ్ళితిని. తిరుమలదాసు అను పేరుగల ఆ రజకుడు 70 సంవత్సరముల వయస్సుగల వృద్ధుడు. అతడు తన గుడిశె నుండి బయటకు వచ్చి, ఆదరముగా నన్నొక మంచముపై కూర్చొండబెట్టెను. బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాల భాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరయిననూ నాకు చాల ఆత్మీయులుగా కనిపించాసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమలదాసు నాకు యిచ్చెను. దానిని నేను శ్రీపాదవల్లభుల ప్రసాదముగా భావించి స్వీకరించితిని. తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను.





అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట

“అయ్యా! ఈ రోజు ఎంతయో సుకృతము! నాకు మీ దర్శనభాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీతికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయనా! శంకరభట్టు! వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు యీ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురము నందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను. పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుత గమనించి దానిని జాగ్రత్తపెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసానకాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణములు విడుచుట చేత నేను రజక జన్మము నొందితిని. జన్మావసానమున ఏ సంకల్పముతో ప్రాణము విడువబడునో, తదనుగుణమైన మరు జన్మము లభించును. నా పూర్వ పుణ్య వశమున గర్తపురీ (గుంటూరు) మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయెను. ఆ గ్రామము నందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. బావబావమరుదులు యిద్దరునూ మహా పండితులే. గోదావరీ మండలాంతర్గతమైన “అయినవిల్లి” అను గ్రామములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు యిద్దరునూ వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొన వలెననియూ, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమీయ వలెననియూ, కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు యిద్దరునూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచ గలమనియూ, వేదోక్తముగా సమస్తమునూ జరిపిన్చాగాలమనియూ ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, ఆనతి కాలములోనే వారు గణేశచతుర్థినాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదరని ఆనతిచ్చిరి. యజ్ఞమునకు హాజరయిన వారందరునూ ఆశ్చర్యచకితులయిరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనిపిన్చినదంతయునూ ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. అట్లయిన మరియొక పర్యాయము నిదర్శనమీయవలయును, అని వాడిన్చిరి.

కాణీపుర వినాయకుని మహిమ

అప్పుడు హోమగుండము నందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహా గణపతి రూపము “మూర్ఖులారా! త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడునూ, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియునూ, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియునూ, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియునూ, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువునూ, సమస్త సిద్ధులూ సిద్ధించుటకు సిద్ధ మునులునూ, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మథుడునూ, యిదే విధముగా సమస్త దేవతలునూ, నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీశక్తులు, రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్తయే. విష్ణురూపములో బ్రహ్మరుద్రులు విలీనమయిన అది దత్తరూపము. ధర్మశాస్త రూపములో గణపతి, షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడును త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి యున్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశ చతుర్థి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్యతత్త్వము వలన వారిది కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త తత్త్వము వలన వారిది సమస్త ధర్మ కర్మలకు ఆదియునూ, మూలమునూ అని గమనించుడు. రాబోవు వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు. జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును.



ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియూ అసత్యము పలికినండులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసందులయిన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురునూ అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు.” అని పలికెను.





కాణీపుర వినాయకుని మహిమ

“నాయనా! వారు ముగ్గురునూ యీ కాణిపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించిననూ, త్రిమూర్త్యాత్మకుడయిన దత్తుని దూషించిననూ లెక్కకు మిక్కుటమయిన అనర్థములు దాపురించును. సోదరులయిన యీ ముగ్గురును ఒక “కాణి” భూమిని యీ గ్రామమునందే సాగుచేసికొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడుబావి కలదు. దీనినుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనెడివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకానొక రోజున నీరంతయూ ఖర్చుకాగా, పారతో యిసుకను తోడు ప్రయత్నములోనుండిరి. ఆ నీటి అడుగుననున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శవలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గ్రుద్దితనము పోయినది. ఆ రాయి స్వయంభూవినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తలమీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది.



ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్యఋషీశ్వరులైన బాపన్నావధానులును, వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో “మహాభూమి నుండి ఈ లోకములోనికి వచ్చినాను. పృథ్వీ తత్త్వములో అవతరించితిని. ఈ తత్త్వము కాలచక్రమున అనేక మార్పులను చెందును. జల తత్త్వములోను, అగ్ని తత్త్వములోను, వాయుతత్త్వములోను, ఆకాశ తత్త్వములోను, నా అవతరణ యిదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరోనరించిన మహాయజ్ఞములోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్య మండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణము నందును, కాశీయండును, బదరీ యందును, కేదారము నందును కూడా ఏక కాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధరా! మీ యింటిపేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులయిన మీ వంశస్థులు ఇకనుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరు గాక!” అనెను.



రాజకుడైన తిరుమలదాసు శంకరభట్టు తో “నాయనా! శంకరా! మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును, శ్రీధరావధానులును పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్య లీలలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నియూ సవిస్తారముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగ పిల్లవాడు కలదు. అతడు రావిదాసు అను పేరిట కురువపురం గ్రామమునందే నివసించుచు, అచట శ్రీపాదులవారికి యధోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురములోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తి ననుసరించి జీవించుచున్నాను.

నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలిసికొందువు. వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి  అనువానిని కలుసుకొనిన యెడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తమున్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధమున్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానేరావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ.” అని తెలిపెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

 

ఇవి కూడ చదవండి :శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1 | sripada srivallabha charitamrutam sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2 sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4

Related posts

Share this