Ratha Saptami 2025 హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథ సప్తమి ఎంతో అత్యుత్తమైనదిగా పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో రథ సప్తమి ఎప్పుడొచ్చింది.. సూర్యుడి ఆరాధనకు శుభ సమయం ఎప్పుడొచ్చిందో తెలుసుకోండి…
Ratha Saptami 2025 హిందూ పంచాంగం ప్రకారం, అచల సప్తమి లేదా రథ సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా.. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథ సప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథ సప్తమి వేళ పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి…
సకల పాపాలు తొలగిపోతాయని
పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథ సప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
శుభ ముహుర్తం..
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథి 04 ఫిబ్రవరి 2025 ఉదయం 7:56 గంటలకు సప్తమి ప్రారంభమై, మరుసటి రోజు 05 ఫిబ్రవరి 2025 తెల్లవారుజామున 5:29 గంటలకు ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం, సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యదోయ సమయం 6:36 గంటల కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి జరుపుకుంటారు.
