పెదబయలులో ఇద్దరు మృతి
ఆలస్యంగా వెలుగులోకి..
అల్లూరి జిల్లా: నాటు వైద్యం ఇద్దరి ప్రాణాలను తీసింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అరడకోట పంచాయతీలోని చుట్టుమెట్ట గ్రామానికి చెందిన నాటు వైద్యుడు కిముడు సహదేవ్ (40), ఆయన సోదరి పాంగి అనాసమ్మ బుధవారం మామిడి కాయలు కోసేందుకు కొండపైన ఉన్న తోటలోకి వెళ్లారు. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో అనాసమ్మ భయపడ్డారు. ఆ విషయాన్ని సోదరుడు సహదేవ్కు చెప్పగా ఆయన దెయ్యం పట్టి ఉండొచ్చని భావించి వనమూలికలతో ఇంటి వద్దనే నాటు వైద్యం ప్రారంభించారు. నాటు వైద్యం వికటించడంతో సహదేవ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు నయం చేసేందుకు ఒడిశా రాష్ట్రంలోని పాములపుట్టు గ్రామానికి చెందిన మరో నాటు వైద్యుడిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆయన కూడా వనమూలికలతో వైద్యం ప్రారంభించారు. మంటల్లో కాల్చిన కత్తిపై మూలికలు వేసి సహదేవ్ ముఖం మీద ఊదారు. దట్టంగా పొగలు రావడంతో ఊపిరాడక సహదేవ్ సహా ఒడిశా నాటు వైద్యుడూ అస్వస్థతకు గురయ్యారు. గంట వ్యవధిలోనే ఇరువురూ మృతి చెందారు. పాత్రికేయుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ మనోజ్ కుమార్, సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నాటు వైద్యానికి ఉపయోగించిన వస్తు సామగ్రి, ఇనుప కడియాలు, శంఖం, వనమూలికలను స్వాధీనం చేసుకున్నారు