June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

• రెండేళ్లలో ఐదోసారి యువకుడి హల్చల్

 

సైదాబాద్: అతిగా మద్యం సేవించాడు. భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత విద్యుత్ స్థంభం ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. ఇప్పటికి ఈ విధంగా ఐదుసార్లు స్థానికులను, పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం మరోసారి మద్యం మత్తులో విద్యుత్ స్థంభం ఎక్కి దూకుతా.. దూకుతా.. అంటూ బెంబేలెత్తించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సింగరేణి కాలనీలో నివసించే దినసరి కూలి మోహన్బాబు (25) బుధవారం మద్యం సేవించి కాలనీలోని హైటెన్షన్ విద్యుత్ స్థంభం ఎక్కాడు.

 

స్థానికులు గమనించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు అతనికి నచ్చచెప్పి కిందికి దించి పోలీసుస్టేషన్కు తరలించారు. గంటసేపు అతని డ్రామా స్థానికంగా కలకలం సృష్టించింది. మరోసారి ఇలా ప్రవర్తించకుండా పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

Share via