జగన్ ఓటమిపై విచారణ జరిపించాలని డిమాండ్
కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి భార్యా పిల్లలతో కలిసి దూకేస్తానని బెదిరింపు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమిని తట్టుకోలేని ఓ అభిమాని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. జగన్ ఓటమిపై వెంటనే విచారణ జరిపించాలని, లేదంటే తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించాడు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నిలబడి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించాడు. సదరు అభిమాని భార్య ఆ వీడియో తీస్తుండగా కొడుకును ఎత్తుకుని ఆ అభిమాని మాట్లాడాడు.
తనకు తనలాంటి పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడని ఆయన చెప్పాడు. ఎంతోమందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటని ప్రశ్నించాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, మరొకటని.. ఇలా ఏవేవో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ తమకు న్యాయం జరగాలని, జగనన్న మళ్లీ సీఎం కావాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో జగనన్నకు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పెద్దలందరికీ చేరేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశాడు.
తన కుటుంబం ఏమైపోయినా పర్లేదు, తమ నలుగురి ప్రాణాలు పోయినా రాష్ట్రంలోని తమలాంటి పేదవాళ్లకు మేలు జరిగితే చాలని కోరాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అలా కాకుండా తమను కాపాడేందుకు ఎవరైనా బ్రిడ్జిపైకి వస్తే గోదావరిలో దూకేస్తామని బెదిరించాడు. కాగా, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిది బ్రాహ్మణగూడెం అని, వైసీపీ అధినేత జగన్ కు అతను అభిమాని అని తెలుస్తోంది.
Also read
- Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగల బాగోతం..!
- నేటి జాతకములు 29 జూన్, 2024
- Shadnagar: షాద్నగర్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
- ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం.. కుటుంబాన్ని కాపాడిన కొడుకు..
- అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..