SGSTV NEWS
CrimeNational

‘6 బ్యాక్‌లాగ్స్‌.. అకడమిక్‌ ఒత్తిడి భరించలేకున్నా.. అందుకే ఈ నిర్ణయం’ కలకలం రేపుతున్న బీటెక్‌ విద్యార్ధిని సూసైడ్ లెటర్


చదువుల ఒత్తిడి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న బ్యాక్‌లాగ్‌లు, తోటి విద్యార్ధుల పోటీ వెరసి బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధిని సూసైడ్‌కి కారణమయ్యాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..


ఈశాన్య కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన మహన్‌టప్ప దంపతులకు తేజస్విని (19). వీరికి ఆమె ఒక్కతే కూతురు. కొడుగు జిల్లాలోని ఓహల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో సీట వచ్చింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులో తేజస్విని చేరింది. కోటి జాగ్రత్తలు చెప్పి కూతురిని అక్కడికి పంపించారు తల్లిదండ్రులు. మూడు రోజుల క్రితం కూడా తేజస్విని ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. మిస్సైన ఫ్రెండ్స్‌కు బుధవారం స్వీట్స్‌ కూడా పంచింది. ఏం జరిగిందో తెలియదుగానీ అదే రోజు తరగతులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన హాస్టల్‌ గదికి వెళ్లిపోయింది.


సాయంత్రం 4.30 గంటలకు అంటే అరగంట తర్వాత ఆమె క్లాస్‌మేట్స్‌లో ఒకరు తేజస్విని గది తలుపు కొట్టగా ఎంతకూ లోపలి నుంచి అలికిడి రాలేదు. లోపలి నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించింది. ఆమెకు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో వెంటనే హాస్టల్ సూపర్‌వైజర్‌కి ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే హాస్టల్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా తేజస్విని లోపల అపస్మారకస్థితిలో కనిపించింది.

వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమె గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను చదువు ఒత్తిడి కారణంగా తాను సూసైడ్‌ చేసుకుంటున్నట్లు తెలిపింది. తనకు ఆరు బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని, చదువు కొనసాగించడం ఇష్టపడటం లేదని అందులో చెప్పింది. పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఒక్కగానొక్క కుమార్తె అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో కన్నోళ్లు తల్లడిల్లిపోతున్నారు. ఒత్తిడి భరించలేకపోతే ఆ విషయం తెలియజేసి ఉంటే నచ్చిన మరో కోర్సులో చేర్పించేవాళ్లం.. అసలు చదువే ఇష్టం లేకపోతే చదువలేనని ఒక్కమాట చెప్పినా నా చిట్టితల్లి ప్రాణాలు కాపాడుకునే వాళ్లం కదాని తేజస్విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు

Also read

Related posts

Share this