June 29, 2024
SGSTV NEWS
CrimeNational

Mistake Surgery: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతి వేలికి బదులు.. నాలుకకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు

బాలికకు ఆపరేషన్ చేసి ఆరో వేలు తొలగించాల్సి ఉంది. కానీ, ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. వేలికి ఆపరేషన్ చేయలేదని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీయటంతో..

కేరళలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం బయటపడింది. కోజికోడ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. కానీ, అక్కడి వైద్యులు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విషయం తీవ్ర రూపం దాల్చటంతో కేరళ ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం వైద్య కళాశాలలోని ప్రసూతి, శిశు సంరక్షణ కేంద్రంలో బాలికకు ఆపరేషన్ చేసి ఆరో వేలు తొలగించాల్సి ఉంది. కానీ, ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి ఉంది. బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. వేలికి ఆపరేషన్ చేయలేదని కుటుంబీకులు గుర్తించారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీయటంతో నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని నర్స్‌ చెప్పింది. ఇది విని వారంతా షాక్‌ అయ్యారు. కానీ, జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు వారికి క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని చెప్పారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.

ఈ విషయంపై వెంటనే స్పందించిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నివేదికను కోరారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చేరింది. కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via