ASHTADASA PURANAS
పురాణం అంటే ఏమటి? వీటిని ఎవరు రచించారు? వీటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Ashtadasa Puranas : పురాణాలు కల్పితాలు కావు. పురాణం అంటే ‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యత్ వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోయే చరిత్రలను వ్యాసభగవానుడు పద్దెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలు ఏమిటి? ఆ పురాణాల నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అష్టాదశ పురాణాలు
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. మత్స్య పురాణము : శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాల గురించి విపులంగా వివరించి ఉన్నాయి. మత్స్య పురాణంలో మొత్తం 14,000 శ్లోకాలు ఉన్నాయి.
2. మార్కండేయ పురాణము : ఈ పురాణం మార్కండేయ మహర్షి వివరించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ పురాణానికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో శివ, విష్ణువుల, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు, దుర్గా సప్తశతి, దేవీ మాహాత్య్యము చండీ, శతచండీ, సహస్ర చండీ హోమాల విధానం గురించి వివరంగా ఉన్నాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి
3. భాగవత పురాణము : ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన శుకమహర్షికి బోధించగా, శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. ఈ పురాణంలోని పన్నెండు స్కంధాలలో శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను గురించిన వివరణ ఉంది. భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి.
4. భవిష్య పురాణము : ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. ఈ పురాణంలో సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. భవిష్య పురాణంలో మొత్తం 14,500 శ్లోకాలు ఉన్నాయి.
5. బ్రహ్మ పురాణము : ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనల గురించిన వివరాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణంలో మొత్తం 10,000 శ్లోకాలున్నాయి.
6. బ్రహ్మాండ పురాణము : ఈ పురాణం బ్రహ్మదేవుడు మరీచికి బోధించాడు. ఇందులో రాధాకృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీలలితా సహస్రనామ స్తోత్రాలు, శివ, విష్ణు స్తోత్రాలు, గాంధర్వ, ఖగోళ శాస్త్ర వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణంలో మొత్తం 12,000 శ్లోకాలు ఉన్నాయి.
7. బ్రహ్మవైవర్త పురాణము : ఈ పురాణం సావర్ణమనువు నారదునకు బోధించాడు. ఈ పురాణంలో గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు వివరములు, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల మహిమలకు సంబంధించి వివరాలు ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి.
8. వరాహ పురాణము : శ్రీమహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీ శ్రీనివాసుని చరిత్రము, వేంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. వరాహ పురాణంలో మొత్తం 24,000 శ్లోకాలు కలవు.
9. వామన పురాణము : ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఈ పురాణంలో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కల్యాణము, గణేశ, కార్తికేయుల చరిత్రలు, భూగోళ, ఋతు వర్ణనలు ఉన్నాయి. వామన పురాణంలో మొత్తం 10,000 శ్లోకాలు ఉన్నాయి.
10. వాయు పురాణము : వాయు పురాణము వాయుదేవుడు లోకానికి వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ పురాణంలో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ, ఖగోళ వర్ణనలు ఉన్నాయి. వాయు పురాణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి.
11. విష్ణు పురాణము : ఈ పురాణాన్ని పరాశరమహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణుమహత్యము, ప్రహ్లాద, ధృవ, భరతుల చరిత్రలు వివరించి ఉన్నాయి. విష్ణు పురాణంలో మొత్తం 23,000 శ్లోకాలు ఉన్నాయి.
12. అగ్ని పురాణము : ఈ పురాణము అగ్నిదేవుడు వశిష్టునకు బోధించాడు.ఇందు శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు గురించిన వివరణ ఉంది. అగ్ని పురాణంలో మొత్తం 15,400 శ్లోకాలు ఉన్నాయి.
13. నారద పురాణము : ఈ పురాణాన్ని నారదుడు, బ్రహ్మమానసపుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము అంటే శివస్తోత్రము, ముఖ్యమైన వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. నారద పురాణంలో మొత్తం 25,000 శ్లోకాలు ఉన్నాయి.
12. అగ్ని పురాణము : ఈ పురాణము అగ్నిదేవుడు వశిష్టునకు బోధించాడు.ఇందు శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు గురించిన వివరణ ఉంది. అగ్ని పురాణంలో మొత్తం 15,400 శ్లోకాలు ఉన్నాయి.
13. నారద పురాణము : ఈ పురాణాన్ని నారదుడు, బ్రహ్మమానసపుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము అంటే శివస్తోత్రము, ముఖ్యమైన వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. నారద పురాణంలో మొత్తం 25,000 శ్లోకాలు ఉన్నాయి.
14. స్కంద పురాణము : ఈ పురాణము కుమారస్వామి లోకానికి బోధించినట్లుగా తెలుస్తోంది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహాత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవా ఖండము, వేంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మ ఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రానది, మహాకాల మహాత్మ్యాన్ని తెలిపే అవంతికా ఖండము గురించి వివరణ ఉన్నాయి. స్కంద పురాణంలో మొత్తం 81,000 శ్లోకాలు ఉన్నాయి.
15. లింగ పురాణము : ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు అనేక వ్రతముల గురించి వివరించి ఉన్నారు
16. గరుడ పురాణము : ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాడు. ఇందులో జీవి జనన, మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు, దశ మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించిన వివరణ ఉంది. గరుడ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలు ఉన్నాయి.
17. కూర్మ పురాణము : కూర్మవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్య క్షేత్రముల వివరములు ఉన్నాయి. కూర్మ పురాణంలో మొత్తం 17,000 శ్లోకాలు ఉన్నాయి.
18. పద్మ పురాణము : అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మ పురాణము. ఈ పురాణాన్ని వింటే, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థసారము, గంగా మహాత్మ్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థవృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, దైవ పూజా విధి విధానాలు గురించి విపులంగా వివరించి ఉంది. పద్మ పురాణంలో మొత్తం 85,000 శ్లోకాలు ఉన్నాయి.
ఈ అష్టాదశ పురాణాల పేర్లు ప్రతిరోజూ స్మరించుకున్నంత మాత్రాన్నే సకల పాపాలు పోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం. శుభం భూయాత్