Garuda Purana: మనిషి చనిపోయిన తర్వాత పునర్జమ్మ ఎలా దొరుకుందో మీకు తెలుసా..? ఆత్మ ప్రయాణంలో ఎన్ని లోకాలు తిరుగుతుంది. యముడి దగ్గరకు వెళ్లిన ఆత్మ పాపాల చిట్టా ఎలా లెక్కిస్తారు. అసలు పునర్జన్మ గురించి గరుడపురాణం ఏం చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మను నాలుగు లోకాలకు పంపించే యమధర్మరాజు:
మనిషి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకం తీసుకుని వెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడులను, పాప పుణ్యాలను చిత్రగుప్తుడి చేత లెక్కబెట్టిస్తాడట. మనిషిగా భూలోకంలో ఉన్నప్పుడు ఆ ఆత్మ చేసిన కర్మల ఫలితంగా యమధర్మరాజు ఆ ఆత్మను నాలుగు లోకాలకు పంపిస్తాడట. అలా ఆత్మ తిరిగి తిరిగి మళ్లీ భూమ్మీద జన్మించాల్సి ఉంటుందట. కొన్ని సందర్భాలలో ఆత్మకు వెంటనే భూలోకంలో మనిషి జన్మ ఎత్తే అవకాశం కూడా లభిస్తుందని గరుడపురాణంలో ఉందట.
వైకుంఠం: ఆత్మ చేసిన మంచి కార్యాలను అనుసరించి
యమధర్మరాజు ఆత్మను వైకుంఠం పంపిస్తాడట. అసలు చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తులు మాత్రమే ఈ వైకుంఠానికి వెళ్తారట. వైకుంఠం వెళ్లిన ఆత్మలకు ఇక పునర్జన్మ అనేది దాదాపుగా ఉండదనే చెప్తుందట గరుడపురాణం.
స్వర్గలోకం: ఇక ఎన్నో పుణ్యాలు, దానాలు, ధర్మాలు
చేసిన వారి ఆత్మను యమధర్మరాజు స్వర్గానికి పంపిస్తాడట. ఇక్కడ ఇంద్రుడు ఉంటాడు. స్వర్గలోకం వెళ్లిన ఆత్మకు మళ్లీ పునర్జన్మ ఉంటుందట. ఆత్మ చేసిన మంచి కార్యాలను లెక్కగట్టి వారికి ఎన్ని రోజులు స్వర్గంలో ఉండే అర్హత ఉందో అన్ని రోజులు మాత్రమే స్వర్గంలో ఉండటానికి అనుమతి ఇస్తారట. స్వర్గంలో టైం అయిపోతే ఆ ఆత్మను మళ్లీ భూలోకంలో జన్మించడానికి పంపిస్తారట.
పితృలోకం: యమలోకం వచ్చిన ఆత్మల కర్మానుసారం
యమధర్మరాజు పితృలోకం కూడా పంపిస్తాడట. ఈ లోకంలో ఆత్మ చేసిన పాపాలను ప్రాయశ్చితం చేసుకుంటుందట. అంతే కాకుండా పితృలోకంలో ఆత్మ తన పూర్వీకులను కలిసి వారితో కొద్ది రోజులు అక్కడే గడిపి తర్వాత తన టైం వచ్చినప్పుడు మళ్లీ భూలోకంలో మనిషి రూపంలో జన్మిస్తుందట.
నరకలోకం: ఆత్మ చేసిన మంచి కర్మలకు సర్గలోకంలో
సుఖాలు అనుభవిస్తే చెడు కర్మలకు నరకలోకంలో శిక్షలు అనుభవిస్తుందట. ఎన్ని పాపాలు చేసి ఉంటే అన్ని శిక్షలు నరకంలో అనుభవించాలట. నరకలోకంలో పాపాలు చేసేవాళ్లను మోసాలు చేసే వాళ్లను జంతువులను హింసించి బలిచ్చే వారిని యమధర్మరాజు నరకలోకానికి పంపిస్తారట. ఈ లోకంలో ఆత్మలు వారు చేసిన పాపాలకు శిక్షలు అనుభవించి మళ్లీ భూలోకంలో 84 లక్షల జీవరాశులలో ఒక జీవిగా పుడతారట.
