SGSTV NEWS online
CrimeTelangana

Telangana: అయ్యో పాపం.. చదువు కోసం ప్రాణం తీసుకున్న విద్యార్థిని.. బాలాపూర్‌లో విషాదం..



ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బాలాపూర్‌లోని ఇఫ్రా ఖానమ్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజులు, టీసీ ఛార్జీలు చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన చదువుల ఆకాంక్షకు ఆర్థిక కష్టాలు అడ్డుకావడంపై చర్చను లేవనెత్తింది.


ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం ఎర్రకుంట తూర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయి ఇఫ్రా ఖానమ్. గత ఏడాది నాందేడ్‌లో చదువుకుంటూ, ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలై ఉండటంతో మిగిలిన ఫీజులు, 4 వేల రూపాయల టీసీ ఛార్జ్‌లు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. టీసీ తీసుకురాకపోవడంతో పాటు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ పొందలేకపోయిన ఇఫ్రా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థికంగా అడ్డంకులు ఎదురవడంతో ఇఫ్రా ఖానమ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఆవేదనతోనే గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇఫ్రా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. . చదువు కొనసాగించేందుకు డబ్బులు లేవనే కారణంగానే విద్యార్థిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

Also Read

Related posts