SGSTV NEWS online
CrimeTelangana

ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..



తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జవహర్ నగర్ మహిళ అంజు హత్యను చేధించారు పోలీసులు. పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు నెలల పాటు ఎలాంటి క్లూ దొరకకపోవడంతో కేసు క్లిష్టంగా మారినా, సాంకేతిక ఆధారాలతో ఎట్టకేలకు అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మాల్కాజిగిరి పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ మహిళ అంజు హత్య కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా అంజు చిన్న కూతురి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆమెపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న కూతురు తన ప్రియుడు మాంటి రాజ్‌తో ప్రేమలో ఉండగా, ఆ సంబంధానికి తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్న చిన్న కూతురు ప్రియుడితో కలిసి ఆమెను హత్యకు పథకం రచించినట్టు తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిని ఎలాగైన హతమార్చాలనుకున్న కూతురు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది.. జాబ్‌ నుంచి ఇంటికి వచ్చిన తల్లిని ఇంట్లోనే బంధించి, ప్రియుడు మాంటి రాజ్‌తో కత్తితో దాడి చేయించింది. అనంతరం ఇద్దరూ కలిసి అంజు గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన అనంతరం మృతదేహాన్ని ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బెడ్ కింద పూడ్చిపెట్టారు. పెద్ద కూతురికి అనుమానం రాకుండా ఉండేందుకు గదిలో రూమ్ స్ప్రేలు చల్లినట్లు పోలీసులు తెలిపారు.

అయితే గతంలో చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంజు మాంటి రాజ్‌పై పొక్సో కేసు నమోదు చేయించింది. మాంటి రాజ్‌పై ఇప్పటికే రెండు పొక్సో కేసులు ఉండగా, ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినప్పటికీ చిన్న కూతురు అతనితో సంబంధాన్ని కొనసాగించింది. హత్య అనంతరం డబ్బుల కోసం ఇద్దరూ చిట్టీ వేసే వ్యక్తిని సంప్రదించారు. అయితే FIR ఉంటేనే డబ్బులు ఇస్తామని చెప్పడంతో, తల్లి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసి డబ్బులు పొందేందుకు ప్రయత్నించారు.

అంతకుముందే చిన్న కూతురు తన తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని చుట్టుపక్కల వారికి నమ్మబలికింది. ఈ దారుణ హత్య మే 12న జరిగినట్లు, అక్టోబర్‌లో పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే అంజు వాడిన జూపిటర్ స్కూటీని నిందితులు విక్రయించినట్లు తెలిసింది. కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ప్రధాన నిందితుడు మాంటి కుమార్ సింగ్ అలియాస్ మాంటి రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్న కూతురు మైనర్ కావడంతో ఆమెను జువెనైల్ హోమ్‌కు పంపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Also read

Related posts