SGSTV NEWS
CrimeTelangana

CRIME NEWS: ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోనన్నాడు.. ప్రేమికుల రోజునే యువతి ఆత్మహత్య!


నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి చౌదరిగూడలోని ఓ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. 3నెలల క్రితం పంజాబ్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నపుడు అనిల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అతడు నిరాకరించడంతో ఈ నెల14న ఉరివేసుకుంది.

ప్రేమించాడు.. ప్రాణమిస్తా అన్నాడు.. ఎన్నో తేనే పూసిన మాటలు చెప్పాడు. అతడి మాటల్లో తియ్యదనాన్ని చూసి ఆ యువతి దగ్గరైంది. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం చేశారు. కానీ యువతి నోటివెంట పెళ్లి అనే మాట వచ్చేసరికి అతడు మొహం చాటేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ యువతి చివరకు ప్రేమికుల రోజునే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరెక్కడో కాదు తెలంగాణలోనే జరిగింది.

ఉరివేసుకుని మృతి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ సీఐ బి. రాజు వర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ యువతి పేరు అంకిత. ఆమెకు 21 ఏళ్లు. నిర్మల్ జిల్లాకు చెందిన ఆ యువతి అన్నోజిగూడలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే చౌదరిగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. అయితే శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఆ యువతి హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుంది.

అనంతరం రూమ్‌కు చేరుకున్న అంకిత స్నేహితులు వెంటనే షాక్ అయ్యారు. దీంతో అంకిత తండ్రి సాయన్నకు ఫోన్ చేశారు. ఆపై అంకిత తండ్రి సాయన్న శనివారం వచ్చిన తర్వాత ఆ యువతి ఆత్మహత్యకు గల కారణం బయటపడింది. ప్రేమ వ్యవహారమే అంకిత మృతికి కారణమని తెలిసింది.

పెళ్లి చేసుకుంటా
అతడి కథనం ప్రకారం.. అంకిత దాదాపు 3 నెలల పాటు పంజాబ్‌లోని ఓ బ్యాంక్‌లో పని చేసింది. ఆ సమయంలోనే అనిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. అది అలా కొన్నాళ్లు సాగింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. ఇక అంకిత అక్కడ నుంచి చౌదరిగూడకు వచ్చిన తర్వాత కూడా అనిల్ చాలా సార్లు వచ్చి కలుసుకున్నాడు.

మనస్తాపంతో మృతి
అయితే ఈ నెల 14న అంటే వాలెంటైన్స్ డే రోజున తనను పెళ్లి చేసుకోవాలని అంకిత ఒత్తిడి చేయడంతో.. కులాలు వేరు అని చెప్పి అతడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన అంకిత హాస్టల్‌ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి సాయన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share this