SGSTV NEWS online
Andhra PradeshCrime

అప్పు తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఇదేం ప్లాన్‌ రా సామి.. తీరా చూస్తే..!





చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడి ని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన వెలుగు చూసింది. కుప్పంలోని అమరావతి కాలనీలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే కుప్పంకు చెందిన శ్రీనాథ్ ను హతమార్చి పూడ్చి పెట్టినట్టు గుర్తించిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. అక్టోబర్ 27వ తేదీ నుండి కనిపించని శ్రీనాథ్ డెడ్ బాడీ ఎట్టకేలకు దొరికింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీనాథ్ అదృశ్యంపై కర్ణాటకలోని బెంగళూరులో పిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసుల ఎంట్రీతో శ్రీనాథ్ హత్య వ్యవహారం బయట పడింది. ఆర్థిక లావాదేవీలే శ్రీనాథ్ హత్యకు కారణమని భావించిన పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. శ్రీనాథ్ ను హతమార్చిన ప్రభాకర్ ను అదుపులో తీసుకున్న బెంగళూరు పోలీసులు కుప్పం మోడల్ కాలనీ కి చెందిన ప్రభాకర్ ఒక హత్య కేసులో నిందితుడు గా ఉన్నట్టు గుర్తించారు. సొంత చిన్నాన్న కొడుకైన శ్రీనాథ్‌ను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.

కుప్పం మండలం డీకే పల్లికి చెందిన ప్రభాకర్‌కు శ్రీనాథ్ సమీప బంధువే కాదు వరుసకు సోదరుడు కూడా. బతుకు దెరువు కోసం బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డ శ్రీనాథ్ నుంచి ఏడాది క్రితం ప్రభాకర్ దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నాడు. బెంగళూరులోని అక్కిబెలె ప్రాంతంలో స్థిరపడ్డ శ్రీనాథ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభాకర్ ను ఒత్తిడి చేశాడు. ఆర్థిక సంబంధమైన విషయాలతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 27వ తేదీన శ్రీనాథ్ అదృశ్యం కాగా, శ్రీనాథ్ భార్య కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును అత్తిబేలె పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో తన భర్త ఆచూకీ తెలపాలంటూ కర్ణాటక పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీం శ్రీనాథ్ మిస్సింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా సిడిఆర్ నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టింది.

తరచూ ప్రభాకర్‌కు ఫోన్లు రావడం గమనించిన పోలీసులు ఆ కోణం విచారణ చేపట్టారు. రామకుప్పం మండలం ముద్దనపల్లిలో పెళ్లి చేసుకుని స్థిరపడ్డ ప్రభాకర్ పై అనుమానం వచ్చింది. గతంలోనూ క్షుద్ర పూజలు, ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్న ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని విచారించిన కర్ణాటక పోలీసుల్లో అనుమానం బలపడింది. ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో శ్రీనాథ్ ను హత్య చేసినట్లు నిందితుడు ప్రభాకర్ అంగీకరించాడు. కుప్పంలోని తనకు సంబంధించిన ఇంటిలో పాతిపెట్టినట్లు ఒప్పుకోవడంతో కుప్పంలోని ప్రభాకర్ ఇంటికి చేరుకున్నారు. శవాన్ని ఇంటిలోనే పాతిపెట్టిన విషయాన్ని అంగీకరించాడు. దీంతో శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా, లేక మరి ఏదైనా ఇతర అంశాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్రీనాథ్ మొబైల్ ఫోన్ సైతం లేకుండా ప్రభాకర్‌ను కలవడానికి ఎందుకు వచ్చాడన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read

Related posts