SGSTV NEWS
Andhra PradeshCrime

ఇదొక రాంగ్ కాల్ ప్రేమ కథా చిత్రం.. పెళ్లైందన్నా వదలని యువతి.. చివరకు..

మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ భాగమైపోయింది. ఈ క్రమంలో అవసరం ఉన్నా.. లేక పోయినా అవతలి వ్యక్తితో గంటలు తరబడి మాట్లాడడం అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటుతో పరిచయం ఉన్న వ్యక్తుల ఫోన్ లే కాకుండా.. ఒక్కోసారి అపరిచిత వ్యక్తుల కాల్స్ కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలా మాట్లాడిన ఓ రాంగ్ కాల్ ఓ యువతిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. ఈ రాంగ్ కాల్ కథ తెలియాలంటే అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్‎కు చేరిన పంచాయతీ ఏంటో తెలుసుకోవాల్సిందే. అల్లూరి జిల్లా పాడేరుకు చెందిన ఓ యువతికి అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువకుడు రాంగ్ కాల్ చేశాడు. ఆ రాంగ్ కాల్ ఫోన్ సంభాషణ అంతటితో ఆగిపోలేదు. మనిషి నచ్చాడో? లేక మాటలు నచ్చాయో? తెలియదు గాని ఒకరికొకరు ఇలా మాటలు కొనసాగిస్తూనే ఉన్నారు. అలా ఐదు సంవత్సరాలు ఫోన్‎లోనే ఇద్దరూ ప్రేమాయణం సాగించారు.

Also read :కర్నూల్ జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన దారుణసంఘట….
ఇలా ఇంకెంతకాలం మాట్లాడుకుంటాం.. జీవితమంతా కలిసే ఉందాం. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమె అడిగింది. అందుకు అతను కూడా సరే అన్నాడు. ఇంతకాలం ఎదురు చూపులకు ఇక ఫుల్ స్టాప్ పెడదామంటూ వెంటనే రైలు ఎక్కింది ఆ యువతి. తిన్నగా కర్నూలు రైల్వే స్టేషన్‎కు వచ్చేసింది. కర్నూలు రైల్వే స్టేషన్లో కలుసుకున్న ఇద్దరూ.. గుంతకల్లులోని సత్యనారాయణపేటలో ఓ ఇంట్లో దిగారు. మరుసటి రోజు పెళ్లి చేసుకుందాం పదా అంది ఆమె. సారీ.. నాకు పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు మీ ఊరు వెళ్ళిపో అన్నాడు అతడు. కంగుతిన్న ఆమె ఇన్నాళ్లు పెళ్లయిన విషయాన్ని నాకెందుకు చెప్పలేదు.. మరి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు.. నేను తిరిగి వెళ్ళను అని పట్టుబట్టింది.

నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంది ఆమె. దీంతో మనోడికి సీన్ అర్ధమైంది.. ఇంకేముంది సినిమాలో మనం చూసే పాత టెక్నిక్ ఉపయోగించాడు. నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తా అని చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రోజు గడిచిన అతను తిరిగి రాలేదు. దీంతో ఆమెకు విషయం అర్థమైంది. దగ్గర్లోని కసాపురం పోలీస్ స్టేషన్‎కు వెళ్లి రాంగ్ కాల్ ప్రేమ కథా చిత్రాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. తనను మోసం చేసిన యువకుడి పేరు స్వామి అని.. గుంతకల్లులోనే ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉంటాడని.. ఎలాగైనా అతడితో పెళ్ళి జరిపించాలని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. పెళ్లైన యువకుడితో మళ్లీ పెళ్లి ఎలా చేయిస్తామని యువతి కుటుంబ సభ్యులను పిలిపించి.. మహిళా సంఘం నాయకులతో కౌన్సిలింగ్ ఇచ్చి ఊరికి పంపించారు. మొత్తం మీద ఓ రాంగ్ కాల్ ఇద్దరి జీవితాలలో ఐదు సంవత్సరాల కాలం ప్రేమాయణం నడిపించింది. చివరికి రాంగ్ కాల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వచ్చింది.

Also read :పార్క్‎కి వెళ్దామనిచెప్పి.. భార్యను పైలోకాలకు పంపిన భర్త.. అసలు కారణం ఇదే..

Also read :బెట్టింగ్‌లో కాలేజీ ఫీజు పోగొట్టుకున్నాడు.. తల్లిదండ్రులు తిట్టారని..

Related posts

Share this