బస్సులో బంగారం నగలు తీసుకుని వెళ్తున్నారా.? అయితే జరా జాగ్రత్త.. ఆ బంగారాన్ని దొబ్బేయడానికి కేటుగాళ్లు కాచుకుని కూర్చున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.. లేటు ఎందుకు ఈ స్టోరీ చూసేయండి మరి.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల్లా నటిస్తూ బ్యాగుల్లోని డబ్బులు, నగలు ఎత్తుకెళ్ళే ముఠాలు ఎక్కువయ్యాయి… ముఖ్యంగా మహిళల పక్కనే కూర్చుని మాటలు కలిపి వారి బ్యాగుల్లోని విలువైన వస్తువులను చోరీ చేసే మహిళా దొంగల చేతివాటానికి పలువురు సొత్తు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఓ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. ఓ మహిళ బ్యాగు నుంచి 13 తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు ముగ్గురు మహిళలు.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన లక్ష్మీదేవి నంద్యాలలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామానికి 2 రోజుల క్రితం తన కోడలి ఇంటికి వెళ్లి తిరిగి గిద్దలూరు వచ్చే క్రమంలో నంద్యాలలో బస్సు ఎక్కింది. తన కోడలికి చెందిన 20 తులాల బంగారాన్ని తీసుకుని బ్యాగులో జాగ్రత్తగా పెట్టుకుంది. నంద్యాల నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కి సీటులో కూర్చుంది. అప్పుడు ఓ ముగ్గురు మహిళలు వచ్చారు. తన సీటు పక్కనే కూర్చున్నారు. వారు లక్ష్మీదేవిని మాటల్లో పెట్టారు. ఇద్దరు లక్ష్మీదేవితో మాట్లాతుండగా.. మరో మహిళ తన చేతికి పని చెప్పింది. లక్ష్మీదేవికి చెందిన బ్యాగును కత్తిరించి అందినకాడికి 13 తులాల బంగారాన్ని చోరీ చేసింది.
బస్సు గిద్దలూరుకు రాగానే ఆ ముగ్గురు మహిళలు ఏం తెలియనట్టు బస్సు దిగి వెళ్ళిపోయారు. తాను కూడా బస్సు దిగేందుకు బ్యాగును చేతిలోకి తీసుకున్న లక్ష్మీదేవికి షాక్ తగిలింది. తన బ్యాగు చినిగి ఉండటంతో పరిశీలించింది. బ్యాగును కోసి అందులోని 13 తులాల బంగారాన్ని ఎవరో అపహరించినట్టు గుర్తించింది. అది తన పక్కనే కూర్చుని తనతో మాటలు కలిపిన ముగ్గురు మహిళల పనే అని నిర్దారించుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!