SGSTV NEWS
Andhra Pradesh

కాకినాడ: చేపల కూర తింటుండగా ఒక్కసారిగా మహిళకు ఛాతీ, ఉదర భాగంలో నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా

తింటున్నప్పుడు తినే ఆహారంపైనే ఫోకస్ పెడితే మంచిదని పలువురు న్యూట్రిషినిస్టులు చెబుతుంటారు. అలా అయితే ఆహారంలోని పోషకాలు సరిగ్గా శరీరానికి అందుతాయంటారు. కానీ ఇప్పుడున్న ఉరుకులు, పరుగులు జీవితంలో..  తింటూ మరో రెండు పనులు చేస్తుంటారు. ఇలా చేస్తే పోషకాలు అందకపోగా లేనిపోని సమస్యల్లో పడాల్సి వస్తుంది.


కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిని జంప మంగాయమ్మ( 54).. మే 25, ఆదివారం రోజున చేపల కూరతో భోజనం చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఛాతీ, ఉదర భాగంలో నొప్పి ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కాకినాడలోని వివిధ ఆసపత్రులను సంప్రదించినా మూడు రోజులపాటు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. అపోలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గూడె వంశీ చైతన్య కేసు వివరాలు పరిశీలించి.. సిటీ స్కాన్ చేయించారు.  అందులో సుమారు నాలుగు సెంటీమీటర్లు పొడవు ఉన్న చేప ముల్లు అన్నవాహిక నుంచి చొర్చుకొని వెళ్లి గుండె లోపల పెద్ద రక్తనాళం అయినటువంటి అయోట బృహద్ధమనికి గుచ్చుకొని ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో వ్యాస్క్యులర్ సర్జన్ ఎస్విఆర్ కృష్ణను సంప్రదించగా ఆయన రిపోర్టులు చూసి.. కేసు చాలా క్రిటికల్ అని భావించారు. కుటుంబ సభ్యులకు బాదితురాలి ప్రాణాపాయ పరిస్థితిని వివరించి.. డాక్టర్ వంశీ చైతన్య, డాక్టర్ ఎస్ వి ఆర్ కృష్ణ ఎలాగైనా పేషెంట్‌ని కాపాడాలని..  ఒక ప్రణాళిక సిద్ధం చేసి శస్త్రచికిత్సకు ఏర్పాటు చేశారు.

మామూలుగా అయితే ఈ శస్త్ర చికిత్స చాతిని ఓపెన్ చేసి గుండెను ఓపెన్ చేసి సుమారు 10 నుంచి 12 గంటల పాటు కాంప్లికేటెడ్ విధానంతో చేయాల్సి ఉంటుంది. అయితే వైద్యులు అధునాతన పద్దతులు,  అత్యంత మెలకువలు ఉపయోగించి కేవలం మూడు గంటల్లో పూర్తి అయ్యేలాగా ప్రణాళిక రెడీ చేశారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా… మన దేశంలో రెండోసారిగా నూతన విధానంతో ప్రణాళిక సిద్ధం చేసి ప్రముఖ గుండెమత్తు డాక్టర్ అయిన డాక్టర్ ప్రగాఢ నాగేశ్వరరావు (ఎండి, డిఎం) సమక్షంలో జనరల్ ఎనస్తీషియా ఇవ్వగా.. డాక్టర్ వంశీ చైతన్య చాకచక్యంగా చేప ముల్లు తియ్యగా.. ఏకకాలంలో డాక్టర్ ఎస్ వి ఆర్ కృష్ణ అయోటాకు పడిన రంధ్రాన్ని బెలూన్‌తో తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వెంటనే బ్లీడింగ్ ఆగి కంట్రోల్ అయింది. ఆ తర్వాత అయోటాలో కవర్ స్టంట్ వేసి రంధ్రాన్ని మూసేశారు.  ఈ ముగ్గురు డాక్టర్ల సమన్వయంతో ఈ  శస్త్రచికిత్స  మూడు గంటల్లో పూర్తిచేసి గుండెకి అన్నవాహికకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్‌ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. కేవలం నాలుగు రోజుల్లోనే పేషెంట్ రికవర్ అయ్యి డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. మహిళ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపించుకున్నారు.

Also read

Related posts

Share this