SGSTV NEWS
Andhra PradeshAstrology

Child Trafficking: బాబు రూ.5లక్షలు.. పాప రూ.3 లక్షలు.. బెజవాడ అంగట్లో పసిబిడ్డల విక్రయం!



కళ్లు కూడా తెరవని పసి బిడ్దలను.. అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవల్సిన శిశువులను.. ఓ మహిళా ముఠా డబ్బుకు కక్కుర్తిపడి తల్లి ఒడి నుంచి వేరుచేసి లక్షలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాను తాజాగా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. గడచిన 9 నెలల్లో 26 మంది శిశువులను విక్రయించారు..


విజయవాడ, మార్చి 2: అప్పుడే పుట్టిన పసిబిడ్డను కొందరు దుండగులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పసిపిల్లలను తీసుకువచ్చి రాష్ట్రంలో సంతానం లేనివారికి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. విక్రయిందుకు తీసుకువచ్చిన ముగ్గురు పిల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మగపిల్లలు, ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకున్నట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. వివరాల్లోకెళ్తే..


విజయవాడలోని భవానీపురం కబేళా ప్రాంతానికి చెందిన బలగం సరోజిని (21) గతంలో సంతానంలేని దంపతులకు విజయలక్ష్మి అనే మహిళ ద్వారా ఎగ్స్‌ డొనేట్‌ చేసి కమిషన్‌ తీసుకునేది. ఈ క్రమంలో పలువురు యువతులతో కూడా ఎగ్‌ డొనేట్‌ చేయించి కమీషన్‌ తీసుకునేది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పిల్లలను విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపింది. దీంతో ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్‌కు చెందిన అనిల్‌తో పరిచయం పెంచుకుంది. వారు పిల్లలను తీసుకువచ్చి సరోజినికి విక్రయించేవారు. ఆమె రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం చూసుకుని ఇతరులకు విక్రయించేది. మగ బిడ్డనైతే రూ.5 లక్షలు, పాప రూ.3 లక్షలకు విక్రయించేది. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పిల్లలను పాయకాపురం ప్రకాశ్‌నగర్‌లో ఉంటున్న తన బంధువులైన కొవ్వరపు కరుణశ్రీ (25), పెదాల శిరీష (26)ల వద్ద ఉంచేది. కొనుక్కున్న వారికి శిశువులను అప్పగించడానికి అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన షేక్‌ ఫరీనా (26), షేక్‌ సైదాబీ (33)లను నియమించుకుంది.

ప్రకాశ్‌నగర్‌లో పసిపిల్లల విక్రయంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. సూత్రధారి సరోజినితో పాటు మరో నలుగురు యువతులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ముగ్గురు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు శిశువులను ఈ ముఠా విక్రయించినట్లు తేలడంతో ఎవరికి విక్రయించారన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, ఏలూరుకు పోలీసు బృందాలు వెళ్లాయి. ప్రధాన నిందితులురాలు సరోజిని గత 9 నెలల్లో ఏకంగా 26 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో ఓసారి జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోని సరోజినీపై పీడీ యాక్ట్‌ కింద కేసు పెట్టినట్లు సీపీ పేర్కొన్నారు

Also read

Related posts

Share this