Land Fraud: : కీసరలో భారీ భూ మోసం వెలుగుచూసింది. మృతుడి పేరును దుర్వినియోగం చేసి నకిలీ యజమానిని సృష్టించి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిర్యాదుదారు మాదను మాధురి తండ్రి మాదను ఇన్నయ్య 1988లో కుండనపల్లి చాముండిపట్నం టీపీఎస్ కాలనీలో ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. 2021లో ఆయన మరణించగా, స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొంతమంది దుండగులు కుట్ర పన్నారు. అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని నకిలీ యజమానిగా చూపిస్తూ ఆ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు.
డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్..
ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉప్పల వేణు, దొనపటి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. వారు మాదను ఇన్నయ్య అనే మరో వ్యక్తిని గుర్తించి, అతని కుమార్తె గుండిగ జ్యోతిని ప్రలోభపెట్టి కుట్రలో భాగస్వాములుగా చేసుకున్నారు. కీసర సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ సహాయంతో నకిలీ గిఫ్ట్ డీడ్ (డాక్యుమెంట్ నెం. 10462/2025) నమోదు చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కీసర పోలీసులు మార్చి 20న ఉప్పల వేణు, దొనపటి వెంకటరెడ్డి, నకిలీ మాదను ఇన్నయ్య, గుండిగ జ్యోతి, ప్రసాద్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో సబ్-రిజిస్ట్రార్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు
భూమి కొనుగోలు సమయంలో యజమాని వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈసీని తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Also read
- సినిమా రేంజ్ లో భూ కబ్జాకు యత్నం.. కాని చివరిలో బిగ్ ట్విస్ట్ ?
- Balcony Collapse: పంజాగుట్ట లో విషాదం.. శ్రీవాత్స అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి
- శ్రీరామ నవమి ఎప్పుడు? తేదీ, పూజా సమయం ఇదే!
- శ్రీరామ నవమికి ముందే చేయాల్సిన పుణ్యకార్యం.. సమస్యలు తొలగి సకల శుభాలు!
- వీరిది ఏం జాతకం రా బాబు.. ఏం చేసినా చేతినిండా డబ్బే డబ్బు!





