యలమంచిలి రూరల్: పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ దగ్ధమైంది. కాలనీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రిసోర్సు పర్సన్గా పనిచేస్తున్న బండ వెంకటలక్ష్మికి చెందిన హోండా ఏక్టివా వాహనం నుంచి శుక్రవారం అర్థరాత్రి దాటాక ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎదురింట్లో నివసిస్తున్న వారు ఆ మంటలు చూసి ఫోన్ చేసి చెప్పడంతో వెంకటలక్ష్మి, కుమారుడు మురళీకృష్ణ, అతని పిన్ని మంటలార్పేందుకు ప్రయత్నించారు. ఈలోగా కేకలు విన్న కాలనీలో చుట్టుపక్కలవారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.
Also read :భర్త చనిపోవడంతో మరొకరితో వివాహేతర సంబంధం! కానీ, చివరకు
అయితే అప్పటికే వాహనం సగానికి పైగా కాలిపోయింది. శుక్రవారం రాత్రి 11.40 గంటల వరకు మెలకువగా ఉన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత నిద్రపోగానే ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో అగ్ని కీలలు ఎగసిపడడంతో ఇంటికి విద్యుత్ సరఫరా అందించే సర్వీసు వైరుకు మంటలు వ్యాపించి ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. ఇంట్లో నిద్రిస్తున్న వారికి కూడా ప్రమాదం జరిగి ఉండేది. దగ్ధమైన స్కూటీకి సమీపంలో గల 7 ద్విచక్రవాహనాలను స్థానికులు సకాలంలో దూరంగా తీసుకుపోయారు.
Also read :మాయమాటలు చెబుతూ.. హతమార్చుతూ..
గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతోనే స్కూటీ దగ్ధమైనట్టు బాధితురాలు, ఆమె కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని బాధితురాలు వెంకటలక్ష్మి కోరారు. అల్లూరి సీతారామరాజు కాలనీలో ఇటీవల చోరీలు, నేరాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేసి ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Also read :Durga Temple: ఆ చీరనే.. ఈ చీర.. అమ్మవారి సాక్షిగా ఇంద్రకీలాద్రిపై మోసాల దందా.. మారేదెప్పుడు..?