SGSTV NEWS
Andhra PradeshCrime

మరణంలోనూ వీడని బంధం



• రోడ్డు ప్రమాదంలో వంట మాస్టర్ దుర్మరణం

• భర్త లేని లోకంలో తానుండలేనంటూ భార్య ఆత్మహత్య

• గంటల వ్యవధిలోనే దంపతుల మృతి



మధురానగర్ (విజయవాడసెంట్రల్): రోడ్డు  ప్రమాదంలో భర్త మృతి చెందటంతో తట్టుకోలేక భార్య  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా  విజయవాడ  అయోధ్యనగర్ లో  మంగళవారం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మృతి  చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా ఆత్మహత్య  చేసుకుని తనువు చాలించటంతో స్థానికంగా  విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం.. అయోధ్యనగర్కు చెందిన రాచపూడి  నాగరాజు(27) ప్రసాదంపాడులోని ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్గా పని చేస్తున్నారు. నాగరాజు సోమవారం సాయంత్రం 6 గంటలకు పని కోసం ద్విచక్ర వాహనంపై ప్రసాదంపాడుకు వెళ్లారు.

పని ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా బీఆర్టీఎస్ రోడ్డు భానూనగర్ జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసి నాగరాజు భార్య ఉష(20) కుటుంబ సభ్యులతో ఘటనాస్థలికి చేరుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు విగతజీవిగా పడి ఉండటం చూసి ఉష చలించిపోయారు.

స్థానికంగా విషాదఛాయలు

అనంతరం గుణదల పోలీస్టేషన్లో ఉష ఫిర్యాదు చేసి, ఆమె తల్లి చల్లా ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాము ఉండే ఇంటికి వెళ్లిన ఉష తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆదిలక్ష్మి వెళ్లి చూడగా ఉష ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా మరణించడం దంపతుల
మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుందని స్థానికులు తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందటంతో స్థానికంగా  విషాదఛాయలు అలముకున్నాయి. దంపతుల మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గుణదల,
అజిత్ సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this