తల్లి పొత్తిళ్లలో పడుకున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది.
సత్తుపల్లి, తల్లి పొత్తిళ్లలో పడుకున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాసి జంపన్న, దుర్గ దంపతులు వారం క్రితం బతుకుదెరువు కోసం తమ కుమారుడు సాయిదేవాన్షును తీసుకుని సత్తుపల్లికి వలసవచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు శివారులోని ప్రైవేటు భూముల్లో డేరా వేసుకుని అందులో తలదాచుకుంటున్నారు. జంపన్న గ్యాస్ పొయ్యిలను బాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గ నిద్ర లేచి కుమారుడికి పాలు ఇచ్చి.. దుప్పటి కప్పి పడుకోబెట్టింది. ఒంటి గంటకు తిరిగి లేచి చూసేసరికి గుడారంలో అతడు కన్పించలేదు. చుట్టుపక్కల డేరాలు వేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్థానికులతో కలిసి ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. తమ కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ టి.కిరణ్ నేతృత్వంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. తాము నివాసం ఉండే ప్రాంతానికి గత నాలుగైదు రోజులుగా సాయంత్రం సమయంలో ఓ కారు వస్తోందని, అందులో ఓ వ్యక్తి రాత్రి వరకు ఉండి వెళ్లిపోతున్నాడని, అతడే రెక్కీ చేసి చిన్నారిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





