SGSTV NEWS online
CrimeTelangana

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?



హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ జరుపుల సాయికుమార్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.


హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జరుపుల సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ మృతిచెందిన విషయం తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.. అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయికుమార్ తీవ్ర ఒత్తిడికి గురై ఉండొచ్చని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.


మృతుడి సెల్‌ఫోన్‌ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. ఫోన్‌లో ఉన్న సమాచారం దర్యాప్తులో కీలకంగా ఉండొచ్చని వారు పేర్కొన్నారు. సాయికుమార్ బి.ఎన్.రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా విధుల్లో తీవ్రమైన పనిభారం ఉందని ఆయన తనతోటి రూమ్‌మేట్స్‌, స్నేహితులతో చెప్పేవాడని వారు తెలిపారు.

అయితే సాయికుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాయికుమార్‌పై ఏమైనా ఒత్తిడి ఉందా? విధుల్లో ఎదురైన సమస్యలే కారణమా? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు, మృతుడి ఫోన్‌, ఇతర ఆధారాల విశ్లేషణ అనంతరం ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also read

Related posts