నెల్లూరు జిల్లాలో వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కలకలం రేపింది. ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ, కుక్కలను చంపే ఇంజక్షన్ వేసి శ్రీహరిని హతమార్చాడు. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీహరి భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిదే కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బావమరిది పరారీలో ఉండగా, ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యవసాయ అధికారిది హత్యగా పోలీసులు నిర్ధారించారు. శ్రీహరి తన సొంత బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తిని అతనికి రాసిచ్చారు. అప్పుగా కొంత డబ్బును ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీహరి ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బులు తిరిగి ఇవ్వాలని హరికృష్ణ కోరారు.
అయితే డబ్బులు, ఆస్థి తిరిగి ఇవ్వడం ఏమాత్రం ఇష్టంలేని అతను, బావను హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు. ఇందుకు మరో ఇద్దరిని నియమించుకున్నాడు. జూన్ 15న దైవ దర్శనానికి వెళ్లి వద్దామని నమ్మించి కారులో పెంచలకోనకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో కార్ డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ పథకం ప్రకారం చేజర్ల మండలం సమీపంలో అకస్మాత్తుగా కారు ఆపాడు. అప్పటికే కాపు కాచిన గొలగముడికి చెందిన రవీంద్ర, రామతీర్థంకు చెందిన యానాదయ్యలు కారు ఆపగానే శ్రీహరిని పట్టుకున్నారు. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజక్షన్ రెండు శ్రీహరికి వేయడంతో ఆయన గుండె ఆగిపోయింది. దీంతో గుండెపోటుగా చిత్రీకరించి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సొంత ఊరు మినగల్లుకు తీసుకువచ్చారు.
మృతి విషయం తెలిసిన తోటి ఉద్యోగులు మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వచ్చినా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియలో భాగంగా సహజంగా పూడ్చాలని ఆచారం ఉన్నా కూడా హరికృష్ణ ఒత్తిడితో కాల్చేశారు. ఇటీవల హరికృష్ణ శ్రీహరికి సంబంధించి మిగిలిన ఆస్తి తనకు ఇవ్వాలని ఘర్షణ పడటంతో ఆయన భార్య లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై రూరల్ డీఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి రవీంద్ర, యానాదయ్యలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు.
Also read
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి
- 100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!
- పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, వివాహ యోగం ఖాయం!





