SGSTV NEWS online
Andhra PradeshCrime

విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?



Vizianagaram Land: విజయనగరం జిల్లా గరివిడి  మండలంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన MSME పార్క్ కోసం, భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టడంతో ఈ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ భూమి కాదు..

గరివిడిలోని బాగువలస, వెదుళ్లవలస గ్రామాల పరిధిలో దాదాపు 21.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో MSME పార్కు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత భూమి అంటూ YCP నేత, మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు ఫ్యామిలీ నష్టపరిహారం కోరడంతో అసలు గుట్టు రట్టయింది. అంతేకాదు బాగువలసలోని ప్రభుత్వ భూములకు తమ్మినాయుడు నకిలీ పత్రాలు సృష్టించి.. వెబ్యాండ్లో తన కుటుంబసభ్యుల పేరిట మార్పించుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెవెన్యూ అధికారి పాత్ర..

2013 నుంచి 2019 మధ్య గరివిడి మండలంలో పనిచేసిన అప్పటి నలుగురు తహసీల్దార్ల అధికారిక లాగిన్ల ద్వారానే ఈ రికార్డుల మార్పిడి జరిగినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కీలక రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం ‘డీ-పట్టాలు’ లేకపోయినా.. సర్వే నెంబర్ 196-1లోని 6.64 ఎకరాలను తమ్మినాయుడు సోదరుల పేరిట విడివిడిగా మార్చేసి అడంగల్ పత్రాలు కూడా పొందారు.

దశాబ్దాలుగా తోటపంటలు..

సీన్ కట్ చేస్తే ఈ భూమిలో దశాబ్దాలుగా తోటపంటలు సాగు చేసుకుంటున్న రైతులు, రికార్డుల్లో వేరే వాళ్ల పేర్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. న్యాయం చేయాలంటూ బాధితులంతా MLA కళా వెంకట్రావును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ల్యాండ్ స్కామ్కి సంబంధించిన ఫైల్ విజయనగరం జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. మొత్తానికి అక్రమాలకు సహకరించిన నలుగురు తహసీల్దార్లపై, భూమిని ఆక్రమించిన మాజీ సర్పంచిపై కలెక్టర్ ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Also read

Related posts