SGSTV NEWS online
CrimeTelangana

మాదాపూర్‌లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?



Hyderabad News: హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న కోదాడకు చెందిన పూజారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటర్ బెటర్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె, పరీక్షకు ముందురాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కలకలం రేగింది.


హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పూజారెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటన కలకలం రేపింది. కోదాడకు చెందిన పూజారెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. బెటర్మెంట్ కోసం మళ్లీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంది. ఇవాళ్టి నుంచి ఇంటర్ బెటర్మెంట్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షకు హాజరు కావాల్సిన రోజుకు ముందురాత్రి ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.


తోటి విద్యార్థులు గమనించి వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. అనంతరం హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణలో, పరీక్షల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. ఈ ఘటనపై పోలీసులు పూజారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం లేదా కాలేజ్ కౌన్సిలర్ సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యం

Also read

Related posts