SGSTV NEWS online
HealthLifestyle

Meals in a day: మూడు పూటలా
భోజనం చేయాలన్నది కచ్చితంగా పాటించాల్సిన నియమమా?



రోజుకు తప్పనిసరిగా మూడు భోజనాలు చేయాలా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇవే సరైన పద్ధతి అని మనలో చాలా మంది నమ్ముతారు. అయితే ఆరోగ్య నిపుణులు చెప్పే నిజం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. వారు చెబుతున్నది ఏమిటంటే, రోజుకు మూడు సార్లు తినడం అనేది కచ్చితమైన నియమం కాదు. ప్రతి ఒక్కరి శరీరం, జీవనశైలి, పని విధానం బట్టి భోజనాల సంఖ్య మారవచ్చు. మూడు భోజనాల తినాలన్న నియమం ఎలా వచ్చింది అనే విషయాన్ని చూస్తే, ఇది బయాలజీకి సంబంధించినది కంటే మన జీవన విధానానికి సంబంధించినది. పాతకాలంలో మనుషులు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినేవారు. తర్వాత పరిశ్రమల విప్లవం వచ్చినప్పుడు పని గంటలు ఫిక్స్ అయ్యాయి. అందుకు అనుగుణంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే పద్ధతి ఏర్పడింది. అంటే ఇది ఆరోగ్యానికి తప్పనిసరి అనే కంటే అలవాటుగా మారిన వ్యవస్థ అని చెప్పవచ్చు.

ఎవరు మూడు పూటలా తినాలి?

ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన ఆహార పద్ధతి సరిపోదు. ఉదాహరణకు, రోజూ జిమ్కు వెళ్లే వారు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు ఎక్కువసార్లు తినాల్సి ఉంటుంది. వారికి శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఎనర్జీ ఎక్కువగా కావాలి. అందుకే వారు రోజుకు మూడు సార్లు కాకుండా నాలుగు లేదా ఐదు సార్లు చిన్న చిన్న మోతాదుల్లో తినడం మంచిది. అలాగే క్రీడాకారులు కూడా తమ శక్తి నిల్వలు తగ్గకుండా ఉండేందుకు మధ్య మధ్యలో స్నాక్స్ తీసుకోవాలి. ఇక ఎక్కువసేపు కూర్చునే పని చేసే వారు లేదా ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండే వారు మాత్రం తక్కువసార్లు తిన్నా సరిపోతుంది. అలాంటి వారు తరచూ తింటే అవసరానికి మించి క్యాలరీలు శరీరంలో చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరికెంత తినాలి అనేది వారి జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

భోజనం చేసే టైమింగ్ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా షిఫ్ట్లలో పని చేసే వారు లేదా తరచూ ప్రయాణం చేసే వారు ఒక నిర్దిష్ట సమయపరిమితిలోనే తినడం మంచిది. ఉదాహరణకు రోజులో 8 నుండి 10 గంటల మధ్యలో అన్ని భోజనాలు ముగిస్తే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఎలా తినాలి?

చాలామంది ఎక్కువసార్లు తింటే మెటబాలిజం పెరుగుతుందని భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శరీరానికి అవసరమైన మొత్తం క్యాలరీలే ముఖ్యమైనవి. ఎన్ని సార్లు తింటామన్నది అంతగా ప్రభావం చూపదు. అదే విధంగా తరచూ తినడం వల్ల కొందరికి జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. మరికొందరికి బరువు పెరిగే అవకాశమూ ఉంటుంది. అయితే బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవారు లేదా యాసిడిటీ ఉన్నవారు మాత్రం చిన్న చిన్న మోతాదుల్ లో తరచూ తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

మీరు తీసుకుంటున్న ఆహారం మీకు సరిపోతుందా లేదా అనే విషయం కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడూ ఆకలి వేయడం, తరచూ అలసటగా అనిపించడం, నిద్ర సరిగా లేకపోవడం, బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం, దృష్టి కేంద్రీకరణ తగ్గడం వంటి లక్షణాలు ఉంటే మీ ఆహార పద్ధతిలో మార్పులు అవసరం ఉన్నట్టు అర్థం. అలాంటి సందర్భాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. రోజుకు మూడు భోజనాలు చేయడం తప్పనిసరి అనే భావన ఒక అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరి శరీరం వేరు, అవసరాలు వేరు. కాబట్టి ఇతరులను అనుసరించడం కంటే మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం.


Related posts