SGSTV NEWS online
Andhra PradeshCrime

అమానవీయ ఘటన.. దొంగతనం చేశాడని ఉద్యోగికి చిత్రహింసలు

కర్రలతో చితకబాది, గాయాలపై పచ్చికారం పెట్టిన యజమాని

మచిలీపట్నం : దొంగతనం చేశాడనే ఆరోపణపై తన దగ్గర పనిచేసే ఉద్యోగిని కర్రలతో చితకబాది కమిలిన చోట్ల, ప్రైవేట్ భాగాలపై పచ్చిమిర్చి, వెల్లుల్లి నూరిన మిశ్రమాన్ని పెట్టి చిత్రహింసలు పెట్టాడో యజమాని. ఈ అమానవీయ ఘటన మచిలీపట్నంలోని పోతేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు పరిమి రవికుమార్ తనను యజమాని చిత్రహింసలకు గురిచేసిన తీరును చెప్పుకొచ్చారిలా.. ‘పోతేపల్లి జ్యుయలరీ పార్క్ ని ఉషా గోల్డ్ పరిశ్రమలో నేను ఏడాది నుంచి మేనేజర్ పని చేస్తున్నాను. షాపులో రోల్డ్ గోల్డ్ తయారీకి ఉపయోగించే పరికరాలు దొంగతనానికి గురయ్యాయని యజమాని తోట రామసురేష్ నన్ను నిలదీశాడు. నాకు దొంగతనంతో సంబంధం లేదని బదులిచ్చినా యజమాని నమ్మలేదు.

ఉదయం 11.30 గంటల సమయంలో మరో ముగ్గురు ఉద్యోగులు గిల్లి రమేష్, మోను, కునాల్తో కలిసి యజమాని నాపై కర్రలతో దాడి చేశారు. అనంతరం పచ్చిమిర్చి, వెల్లుల్లి నూరి వాటి మిశ్రమాన్ని కమిలిన గాయాలతో పాటు ప్రైవేట్ భాగాలపై పెట్టారు. రూ.20 వేల విలువ చేసే పరికరాలు పోయాయని, సాయంత్రం లోపు రూ.2 లక్షలు చెల్లిస్తే కానీ ఇంటికి పోవంటూ బెదిరించారు’ అని వివరించారు.

రోజూ మధ్యాహ్న భోజన సమయంలో భార్య రజినీకుమారి భర్త రవికుమార్కు ఫోన్ చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేయగా భర్త ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దాంతో కంపెనీలోని ఇతర వ్యక్తులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో సోదరుడితో కలిసి కంపెనీ వద్దకు వెళ్లగా భర్తను నిర్బంధించడాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపటి తర్వాత రవికుమార్ ను వదిలిపెట్టడంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts