SGSTV NEWS online
CrimeTelangana

నగరంలో నయా దళారులు.. సాఫ్ట్‌వేర్, రైల్వే ఉద్యోగుల మత్తు దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు


హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నిత్యం ఏదో ఒక మూల మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా మొకిల పోలీసులు ఒక పక్కా సమాచారంతో దాడి చేసి, సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ దందాలో ఎలా నిమగ్నమయ్యారో బయటపెట్టారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు చదువుకున్న వారు, బాగా స్థిరపడిన వృత్తుల్లో ఉన్నవారు కావడం గమనార్హం. పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. అరెస్టైన వారిలో రైల్వే ఉద్యోగి పొన్నాల సిద్ధార్థ (27), ఐటీ ఉద్యోగి చలవాడి హేమంత్ కృష్ణ వంశీ (30), వ్యాపారి అవధూత విష్ణు తేజ (36) ఉన్నారు. వీరి వద్ద నుండి 77 గ్రాముల కోకైన్, గంజాయి, ఎక్స్‌టసీ గుళికలు, ఒక సియాజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరు గోవా పర్యటనల సమయంలో కోకైన్ వినియోగానికి అలవాటు పడి, ఆ తర్వాత దానిని వ్యాపారంగా మార్చుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో గోవా నుండి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. పోలీసులు నిందితుల నుండి భారీ మొత్తంలో మత్తు పదార్థాలను సీజ్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు, ఈ ముగ్గురు నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తూ డ్రగ్స్‌ను వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. రహస్య సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.



సీజ్ చేసిన వస్తువుల్లో 77 గ్రాముల కోకైన్, 2 గ్రాముల గంజాయి (ఓజీ), 3 ఎక్స్‌టసీ గుళికలు, 2 రోలింగ్ పేపర్లు ఉన్నాయి. అదనంగా TS10 EK 9191 నంబర్ గల బ్లూ కలర్ సియాజ్ కారు, మూడు ఐఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. నగరంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూ ఉండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ కేసు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read

Related posts