SGSTV NEWS online
Hindu Temple HistorySpiritual

ఉడుము రూపంలో దర్శనమిచ్చిన నరసింహుడు! ఈ ఆలయం వెనుక ఉన్న అద్భుతం తెలుసా?


మద్దిలేటి నరసింహ స్వామిని దర్శించుకుంటే, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు- అవరోధాలు తగ్గుతాయి!

దక్షిణ భారతంలో నరసింహుని క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభంలో వెలసిన నరసింహుడు హిరణ్యకశ్యపుని సంహారం తరువాత అనేక ప్రాంతాల్లో సంచరించాడు. కానీ ఒక్క క్షేత్రంలో మాత్రం స్వామివారి ఉనికి ఆశ్చర్యపరుస్తుంది. ఆ క్షేత్రమేమిటో? ఆ వివరాలేమిటో? ఈ కథనంలో తెలుసుకుందాం.



మద్దిలేటి నరసింహస్వామి
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో వెలసిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం. ఈ నరసింహ క్షేత్రం పచ్చని ప్రకృతి ఒడిలో కొండకోనల నడుమ, సెలయేటి గలగలలు తప్ప వేరే శబ్దాలు లేని ప్రశాంత వాతావరణంలో వెలసి ఉంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.



స్థల పురాణం
మద్దిలేటి నరసింహస్వామిని గతంలో కదిరి నరసింహస్వామి అని పిలిచేవారు. ఒకసారి కదిరి నరసింహస్వామి ఏకాంతంలో లక్ష్మీదేవితో పాచికలు ఆడి ఓడిపోతారు. పాచికల ఆటలో స్వామివారిని ఓడించిన విజయగర్వంతో అమ్మవారు స్వామిని హేళన చేస్తారు. ఆ అవమానం భరించలేక స్వామివారు ప్రశాంత ప్రదేశంలో కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు. అందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతారు.

ఉమా మహేశ్వరుని సహాయం కోరిన నరసింహుడు
నరసింహస్వామి తాను కొలువు తీరడానికి ప్రశాంత ప్రదేశం కోసం ఎర్రమల, నల్లమల అటవీ ప్రాంతంలో వెతుకుతారు. చివరకు తనకు ప్రశాంత ప్రదేశాన్ని సూచించమని యాగంటి ఉమా మహేశ్వరుని కోరుతాడు. ఉమా మహేశ్వరుని సూచన మేరకు నరసింహస్వామి మద్దిలేరు వాగు పక్కన కొలువు తీరాలని నిర్ణయించుకుంటాడు.

ఉడుము రూపంలో దర్శనమిచ్చిన నారసింహుడు!
ఆ సమయంలో మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర పరిపాలిస్తుండేవాడు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవాడు. ఒక శనివారం ఆయన వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఆయనకు ఆ అడవిలో తళతళ లాడుతూ మెరుస్తున్న ఒక ఉడుము కనిపిస్తుంది. వెంటనే కన్నప్ప దొర ఆ ఉడుమును పట్టుకోమని తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తాడు. భటులు ఉడుమును పట్టుకోడానికి ప్రయత్నించగా ఆ ఉడుము పక్కనే ఉన్న కోమలి పుట్టలోకి ప్రవేశించి తప్పించుకుంటుంది. ఇక చేసేది లేక భటులు వెనుతిరిగి వస్తారు.

నరసింహుని స్వప్న సాక్షాత్కారం
అదేరోజు నరసింహ స్వామి కన్నప్ప దొరకు స్వప్నంలో కనిపించి ఆ రోజు పగలు ఉడుము రూపంలో కనిపించింది తానే అని చెబుతాడు. అర్చక పండితులతో కలిసి వచ్చి పూజలు నిర్వహిస్తే తాను పదేళ్ల బాలుని రూపంలో అక్కడే వెలుస్తానని చెబుతాడు. మరుసటి రోజు కన్నప్ప దొర నరసింహ స్వామి చెప్పినట్లుగా వేద పండితులతో కలిసి వెళ్లి పూజలు జరిపించగా స్వామి సంతోషించి భక్తుల కోరికలు తీర్చడానికి ఇక్కడే వెలుస్తానని వరమిచ్చి అదృశ్యమయ్యాడు.

మద్దులేటి నరసింహ స్వామి అనే పేరు ఇందుకే!
మద్దులేటి వాగు పక్కనే కొలువై ఉండడంతో ఇక్కడ వెలసిన నరసింహ స్వామిని మద్దులేటి స్వామి అని, మద్దిలేటి నరసింహ స్వామి అని వ్యవహరిస్తారు.

పూజోత్సవాలు
మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో ప్రతినిత్యం అర్చన, అష్టోత్తర పూజలు ఘనంగా జరుగుతాయి. విశేషించి ప్రతి శుక్ర, శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అశేష భక్తుల మధ్య వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు ఉత్సవాలు, క్రీడలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో లక్ష తులసి పూజలు విశేషంగా జరుగుతాయి.

భక్తుల పాలిట కొంగు బంగారం
జీవితంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలతో విసిగిపోయిన వారు ఒక్కసారి మద్దిలేటి నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. స్వామిని దర్శించి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన తరువాత తిరిగి బంధుమిత్ర సమేతంగా స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ!

స్వామి పేరు స్థిర నామంగా
ఈ ప్రాంత ప్రజలు స్వామిపై తనకు ఉన్న భక్తిని చాటుకోవడానికి స్వామివారి పేరును తమ పిల్లలకు పెడుతుంటారు.

ఎలా చేరుకోవాలి?
కర్నూలు నుంచి మద్దిలేటి నరసింహ స్వామి ఆలయానికి చేరుకోడానికి నిరంతరం బస్సు, ప్రైవేటు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మద్దిలేటి నరసింహ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం. మోక్షదాయకం!
ఓం నమో నారసింహాయ నమః!

Related posts