పరమ పవిత్రమైన ఈ కార్తిక మాసంలో కేవలం దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే శ్రీశైల క్షేత్రం- మనసులో స్మరించినా చాలు దర్శనఫలం లభిస్తుందని విశ్వాసం!
Srisailam Temple Significance : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో జ్యోతిర్లింగమైన ‘శ్రీశైలం’ భువిలో వెలసిన కైలాసంగా ఖ్యాతి పొందింది. దర్శించినంత మాత్రాన్నే మోక్ష ప్రాప్తిని కలిగించే శ్రీశైల క్షేత్రంలో పరమ శివుడు మల్లిఖార్జున స్వామిగా, పార్వతి భ్రమరాంబికగా వెలసి ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండోదైన శ్రీశైల క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీశైలం ఎక్కడుంది?
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీశైల క్షేత్రం శివ భక్తులకు మోక్షధామం. కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని పొందగలిగే అద్భుత క్షేత్రం శ్రీశైలం. శ్రీశైలం క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే గంగా నదిలో రెండు వేల సార్లు మునిగిన పుణ్యం, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే కలిగేంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం.

ఆలయ స్థల పురాణం
పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు చాలా కాలం పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి, రెండు కాళ్ల, నాలుగు కాళ్ల ప్రాణులచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో అరుణాసురుడు చేయని ఆగడాలు లేవు. ఆ రాక్షసుని ఆగడాలకు భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు.
గాయత్రీ ప్రభావమే రక్షణ
అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు దేవగురువు బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాకకు ఆశ్చర్యపోగా, బృహస్పతి అరుణాసురునితో “మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి నా రాకలో వింత ఏమి లేదని” చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. ఆ విధంగా అరుణాసురునికి ఆరు కాళ్ల ప్రాణిచే మరణం సంభవిస్తుంది. అతడు పొందిన వరం ఇక్కడ పనికిరాకుండా పోతుంది.
శ్రీశైలంలో శివుని మల్లిఖార్జునుడని ఎందుకు పిలుస్తారు?
శ్రీశైల క్షేత్రంలో శివుని మల్లిఖార్జునుడని పూజించడం వెనుక ఓ కథనం ఉంది. కృష్ణానది తీరంలో మల్లికాపుర మహారాజగు చంద్రకేతుడు సంతానం కోసం పరితపిస్తుండగా ఆ రాజుకు లేక లేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజ పురోహితులు చంద్రకేతుని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు జైత్రయాత్రను మొదలుపెట్టి రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి మల్లికాపురానికి చేరుకున్నాడు.
కూతురుపై చంద్రకేతుని దాష్టీకం
రాజ్యానికి తిరిగి వచ్చిన చంద్రకేతు తన అంతఃపురంలో తిరుగుతున్న అందమైన కన్యను చూసి మోహించాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి ‘నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి’ అని వేడుకున్నా, చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు.
జంగమయ్యను శరణు వేడిన చంద్రమతి
తండ్రి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణా నది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరో దారి లేక తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని మల్లెపూలతో పూజించింది.
పాతాళగంగ పచ్చగా ఇందుకే!
చంద్రమతి మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. అనంతరం శివుడు మల్లికాపురమును నిర్మూలిస్తాడు. ఆనాటి నుంచి శివునికి మల్లిఖార్జునుడనే నామధేయం ఏర్పడిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

ఆలయ విశేషాలు
శ్రీమల్లికార్జునుని దేవాలయంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా పూజలందుకుంటున్నాడు. నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము శ్రీశైలం. శ్రీశైలంలో మల్లిఖార్జునుని ఆలయంతో పాటుగా మరెన్నో దర్శనీయ స్థలాలు కలవు. అవేమిటో చూద్దాం.
శక్తి పీఠం కూడా
శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ వెలసిన అమ్మవారు భ్రమరాంబికా దేవి. ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే భ్రమర నాదం వినిపించడం ఇక్కడి ప్రత్యేకత.
సాక్ష్యమిచ్చే సాక్షి గణపతి
శ్రీశైలానికి 3 కిమీల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. ఇక్కడ గణపతిని దర్శిస్తే స్వామి శివునికి ఫలానా భక్తుడు శ్రీశైలానికి వచ్చాడని సాక్ష్యం చేబుతాడట! లేకుంటే మనం శ్రీశైలం వెళ్లిన దర్శన ఫలం దక్కదని విశ్వాసం.
మనోహర గుండం
శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది.
పంచ పాండవుల దేవాలయాలు
పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి. శ్రీశైలం వెళ్లిన వారు ఈ పంచపాండవులు ఆలయాలను కూడా తప్పకుండా దర్శించుకోవాలి.
వృద్ద మల్లికార్జున లింగం
శ్రీశైలం ఆలయంలోని వృద్ద మల్లికార్జున లింగం ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. దీనిని కూడా తప్పకుండా దర్శించుకోవాలి.
పాతాళ గంగ
పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వల్ల పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రింద గల దీన్ని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.
జన్మరాహిత్యం శ్రీశైల శిఖర దర్శనం
శ్రీశైల క్షేత్ర దర్శనంలో అత్యంత ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని దర్శనం చేయగలిగితే పునర్జన్మ ఉండదని, జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
పాలధార, పంచధారలు
సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. ఈ కొండ పగుళ్ల నుంచి పంచధారలతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుంచి నీరు త్రాగి, ఇంకో ధార నుంచి నీరు త్రాగితే రుచిలో మార్పు తెలుస్తుంది.
హటకేశ్వరం
శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ పరమశివుడు అటిక అంటే ఉట్టి, కుండ పెంకులో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదే మెల్లగా హటి కేశ్వర స్వామిగా మారిపోయింది.
ఇష్టకామేశ్వరీ క్షేత్రం
నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే మెత్తగా మనిషి నుదురు లాగా ఉంటుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం.
పూజోత్సవాలు
శ్రీశైలంలో ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా కార్తికమాసం, మహాశివరాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ త్రికాల పూజలు, అభిషేకాలు, స్పర్శ దర్శనం, ధూళి దర్శనం వంటి పూజలతో శ్రీశైలం నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు తిరుమల ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతిరోజూ కళ్యాణం జరుగుతుంది. అయితే శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం సాయంత్రం జరగడం విశేషం. పరమ పవిత్రమైన ఈ కార్తిక మాసంలో కేవలం దర్శించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే శ్రీశైల క్షేత్రాన్ని, మనసులో స్మరించినా చాలు దర్శనఫలం లభిస్తుందని విశ్వాసం.
ఓం నమః శివాయ!
Also read

