SGSTV NEWS
CrimeTelangana

రూ.16 కోసం గొడవ.. రాపిడో ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే

 

హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఓ రాపిడో డ్రైవర్‌పై ఓ మహిళ రెచ్చిపోయింది. 16 రూపాయల కోసం ఏకంగా ఆ మహిళ అతడితో గొడవపడి.. దుర్బాషలాడింది. అంతటితో ఆగకుండా.. రాపిడో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టింది. అక్కడే ఉన్న కొంతమంది ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.


కేవలం రూ.16 కోసం ఒక మహిళ రాపిడో ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో ఒక మహిళ రాపిడో ఆటోను ఆన్‌లైన్‌లో బుక్ చేసింది. అయితే బుకింగ్ సమయంలో ఆమెకు రేటు రూ. 186 చూపించింది. ఆటో డ్రైవర్ వచ్చి ఆమెను పికప్‌ చేసుకొని గమ్యస్థానానికి చేరుకునేసరికి బిల్లు రూ. 202కు పెరిగింది. దీంతో ఆమె ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. తాను మొదట చూపించిన డబ్బులే ఇస్తానని.. 202 ఇవ్వనని నానా రచ్చ చేసింది. అంతటితో ఆగకుండా ఆటో డ్రైవర్‌ను బూతులు తిడుతూ, అవమానించడంతో పాటు చెప్పుతో కొట్టింది.

డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తనతో చాలా అనుచితంగా ప్రవర్తించిందని, మతపరమైన పదాలు కూడా వాడిందని తెలిపాడు. కొన్నిసార్లు ట్రాఫిక్‌లో వెళ్లేసరికి రీడింగ్‌ మారుతుంటుందని, అయినా తాను రీడింగ్‌లో చూపించిన రూ. 202 మాత్రి ఇవ్వమన్నానని.. అదనంగా ఎక్కడా అడగలేదని చెబుతున్నాడు. దానికే ఆ మహిళ అంతలా రెచ్చిపోయి తనపై దాడి చేసిందని ఆరోపించాడు. ఈ సంఘటనపై చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మహిళ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొంతమంది మహిళ ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు డ్రైవర్ ప్రవర్తన కూడా ఎలా ఉందో చూడాలని అంటున్నారు. ఇలాంటి విషయాల్లో సాధారణంగా పోలీసులు రెండు వైపుల వాంగ్మూలాలు తీసుకుని కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఆటో డ్రైవర్ లేదా ఆ మహిళలో ఎవరైనా శారీరక దాడి చేశారని నిరూపితమైతే, అది క్రిమినల్ కేసుకి కూడా దారి తీసే అవకావం ఉంది.

Also read

Related posts