పోలీస్ స్టేషన్కు నీతో కలిసి నేనూ వస్తా అని భార్యను తీసుకెళ్లాడు భర్త. అతడ్ని గుడ్డిగా నమ్మి బైక్ పై వెళ్లిన ఆమె.. చివరికి విగతజీవిగా తిరిగొచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సరావుపేటకు చెందిన మేరీకి, సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే పెళ్లైన కొద్దికాలానికి ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. తరుచూ ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన రమేష్.. భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గొడవలు జరగడం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం జరుగుతూ వచ్చాయి. అయితే శనివారం సాయంత్రం భార్యభర్తలిద్దరూ బైక్పై బయటకు వెళ్లారు. బయటకు వెళ్లిన భార్య తిరిగి రాలేదు. దీంతో తన కుమార్తె కనిపించడం లేదని మేరీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మేరీ నకరికల్లు సమీపంలో శవమై ఉన్నట్లు గుర్తించారు. భర్తతో కలిసి మేరీ వెళ్లినట్లు సీసీకెమెరా విజువల్స్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
శనివారం మద్యం సేవించి వచ్చిన రమేష్ భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే మేరీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో రమేష్.. ‘రా.! స్టేషన్కు నేనే తీసుకెళ్తానని చెప్పి’ నమ్మబలికాడు. రమేష్ మాటలు నమ్మిన మేరీ అతని బైక్ ఎక్కింది. అక్కడ నుంచి ఆమెను రావిపాడు సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని మేరీ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయినట్లు తెలుసుకున్న మేరీ తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో రమేష్ అసలు విషయం చెప్పేశాడు. భార్యను బైక్పై ఎక్కించుకుని కారంపూడి రోడ్డులోకి తీసుకెళ్లాడు. నకరికల్లు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు ఆమెను తీసుకెళ్లి చున్నితో గొంతు బిగించి చంపేశాడు. అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకోగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు
Also read
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా
- ప్లాట్ ఫారం రిక్షా కార్మికులకు “” రిక్షా స్టాండ్”” ఏర్పాటు చెయ్యాలని మంత్రి గారికి వినతిపత్రం…..ఐ.యఫ్.టి.యు.
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!





