SGSTV NEWS
Telangana

Telangana: గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసె వేసిన రోజు కూలీ – ఆవేదనలో అర్థం ఉందండోయ్



నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు ఓ విధమైన కార్యాచరణతో ముందుకెళ్తే, సామాన్య ప్రజానీకం తమ స్థాయిలో నిరసనలు తెలపడం, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం సాధారణం. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అతడి సమస్య ఏంటి..? అతడి వినూత్న నిరసన ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన కలకోట్ల పాండురంగన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందిరమ్మ ఇంటి కోసం పాండురంగన్న కూడా దరఖాస్తు చేసుకున్నాడు. నిరుపేద అయిన తనకు కచ్చితంగా ఇల్లు మంజూరు అవుతుందని ఆశించాడు. తనకు ఇల్లు మంజూరు అవుతుందని స్థానిక నాయకులు కూడా చెప్పడంతో ఎంతో ఆశ పెట్టుకున్నాడు. అయితే, ఇటీవల విడుదలైన 33 మంది ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో పాండురంగన్న ఆవేదన చెందాడు. దీంతో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆయన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట తాటి కమ్మలతో గుడిసె వేసి తన భార్య పిల్లలతో నిరసన వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం గ్రామ నాయకులు, అధికారుల చుట్టూ తీరగానని, వారంతా ఇల్లు ఇప్పిస్తామని తీరా జాబితాలో పేరు రాకుండా చేశారని రంగన్న ఆరోపించారు. కూలి పనులు చేసుకునే తమ కుటుంబానికి సీఎం స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్లకార్డు ద్వారా డిమాండ్ చేశాడు. ఇందిరమ్మ కమిటీ నిర్ణయం మేరకే గ్రామంలో ఇళ్లు మంజూరు చేశామని ఎంపీవో రాజేశ్ చెప్పారు

Also read

Related posts

Share this